ఎస్బిఐ బంపర్ ఆఫర్
ముంబయి : విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) ఇటీవల ప్రవేశపెట్టిన ప్రత్యేక రాయితీ పథకాన్ని అమలు చేయడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్లు చేసే ఖాతాదారులకు ఏకంగా తొమ్మిది రెట్ల రుణ పరపతి సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు వెల్లడించింది. ఆర్బిఐ ప్రకటన చేసిన కొద్ది రోజుల్లోనే ఎస్బిఐ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం విశేషం. ఈ ప్రత్యేక సదుపాయం కనీసం 1 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8.3 కోట్లు) లేదా అంతకంటే ఎక్కువ విలువైన డాలర్ డినామినేటెడ్ డిపాజిట్లకు వర్తిస్తుంది. దీని ప్రకారం కస్టమర్ ఒక మిలియన్ డాలర్లను ఎఫ్సిఎన్ఆర్ (బి) ఖాతాలో జమ చేస్తే.. ఆ మొత్తానికి బ్యాంకు తొమ్మిది మిలియన్ డాలర్ల వరకు రుణాన్ని మంజూరు చేస్తుంది. ఈ పథకం ద్వారా పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన రాబడి లభిస్తుందని ఎస్బిఐ పేర్కొంది. ఐదేళ్ల కాలపరిమితితో చేసే డిపాజిట్లపై బ్యాంకు 6 శాతం వడ్డీని చెల్లిస్తుండగా.. అదే కాలపరిమితికి ఇచ్చే రుణాలపై కేవలం 5.4 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఈ రెండు రేట్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, లీవరేజ్ (పరపతి) ద్వారా వచ్చే ప్రయోజనాన్ని కలిపి చూస్తే పెట్టుబడిదారులకు గరిష్టంగా ఏడాదికి 14.08 శాతం వరకు రాబడి లభించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నిర్ణయం ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు తమ డాలర్ నిల్వలపై మెరుగైన రాబడిని పొందేందుకు ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.









కామెంట్లు (0)