14 లోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం
అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తామని హామీ
ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు) : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ మంగళవారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించి ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పరిశీలించారు. కృష్ణనగర్ లోని 141వ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటరు నమోదు అధికారి లీలా రాణితో మాట్లాడి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగా కొనసాగుతుందని వివేక్ యాదవ్ తెలిపారు. బీఎల్వోల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఓటర్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలోని ఓటర్లకు నూరు శాతం ఎన్యుమరేషన్ పత్రాలు పంపిణీ చేశామని, వాటిలో ఇప్పటివరకు 62 శాతం పత్రాలను డిజిటలైజేషన్ చేసినట్లు వెల్లడించారు. ఈ నెల 14తో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో బీఎల్వోలు సమన్వయంతో పనిచేసి కచ్చితమైన, పారదర్శకమైన ఓటరు జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఓటరు జాబితా లోని డూప్లికేట్ పేర్లు, మరణించిన వారి పేర్లను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందుబాటులో లేని ఓటర్ల తరఫున వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు కూడా ఎన్యుమరేషన్ పత్రాలను సమర్పించవచ్చని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు.








కామెంట్లు (0)