ఐదు నెలల పసిపాపను విడిచి కన్నుమూత.. కురుపాంలో విషాదం
ప్రజాశక్తి - కురుపాం (మన్యం) : ఫినాయిల్ తాగి సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మంగళవారం కురుపాం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... కురుపాం మండలం గుజ్జువాయి గ్రామానికి చెందిన కొండగొర్రి శైలజ (36) గుమ్మలక్ష్మీపురం మండలం ఇరిడి గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా మానసిక అస్వస్థతతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం ఇంట్లో బాత్రూంలో ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మొండెంఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నీలకంఠాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నీలకంఠరావు తెలిపారు. మృతురాలికి భర్త, ఐదు నెలల పసిపాప ఉండడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.








కామెంట్లు (0)