- పంత్ ఫటా ఫట్ అర్ధసెంచరీ
- ఇండియా - 503/9 డిక్లేర్డ్
- శ్రీలంక - 8/2
కొలంబో: రెండో టెస్ట్లోనూ టీమిండియా బ్యాటర్లు రాణించారు. తొలి టెస్ట్లో సెంచరీతో రాణించిన పడిక్కల్.. రెండో టెస్ట్లోనూ మరో శతకాన్ని కొట్టగా.. ధృవ్ జురెల్ అజేయ శతకంతో మెరిసాడు. దీంతో రెండోరోజు ఆట నిలిచే సమయానికి భారతజట్టు తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. జురెల్కి తోడు రిషబ్ పంత్ మెరుపు అర్ధసెంచరీ కొట్టాడు. ఓవర్నైట్ స్కోర్ 5వికెట్ల నష్టానికి 300 పరుగులతో రెండోరోజు ఆటను కొనసాగించిన భారతజట్టు ను ధృవ్ జురెల్(115 నాటౌట్), రిషభ్ పంత్(63)లు ఆదుకున్నారు. ఓవర్నైట్ బ్యాటర్ సురాన్ష్ జైన్(6) త్వరగా ఔటైనా.. 7వ వికెట్కు జురెల్, పంత్ 112పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్(63; 89బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) ధనా దన్ ఇన్నింగ్స్కి తోడు జడేజా(43) బ్యాటింగ్లో రాణించారు. తొలి సెషన్లో, ఆపై లంచ్కు ముందు ప్రత్యర్థి పేస్, స్పిన్ బౌలర్లపై పంత్ ఎదురుదాడికి దిగాడు. టీ బ్రేక్ అనంతరం.. వర్షంతో ఆట ఆలస్యంగా మొదలైనా.. జురెల్ టెస్టుల్లో రెండో సెంచరీ సాధించాడు. అతడి వంద కోసం ఎదురుచూసిన కోచ్ గౌతం గంభీర, కెప్టెన్ శుభ్మన్ గిల్.. 503/9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశారు. లంక బౌలర్లలో ఫెర్నాండో నాలుగు వికెట్లు తీయగా.. జయసూర్య, నువాంత తలా రెండేసి వికెట్లు, లహిరు కుమార ఒక వికెట్తో రాణించారు. ఇండియా తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసిన తర్వాత వర్షం కురవడంతో మ్యాచ్కు కొంతసేపు అంతరాయం కలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక జట్టు రెండోరోజు ఆట నిలిచే సమయానికి 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఉదాన(1), జయసూరియ(2) ఔటవ్వగా.. మిశ్రా (5) క్రీజ్లోఉన్నాడు.
పంత్ అర్ధసెంచరీ
శ్రీలంక బౌలర్ల షార్ట్పిచ్ బంతులకు మణికట్టు గాయంతో తొలిరోజు రిటైర్డ్ హర్ట్ అయిన పంత్, జురెల్ రెండో రోజు హవా చూపించారు. క్రీజులో పడుతూ లేస్తూ తన స్టయిల్లో వీరంగం సృష్టించిన పంత్ 95మీటర్ల, 103 మీటర్ల దూరం సిక్సర్లతో అభిమానులను అలరించాడు. వీరిద్దరి దూకుడుతో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. కానీ, భోజన విరామం తర్వాత తొలి బంతికే పంత్ ఔటయ్యాడు. అసితా ఫెర్నాండో ఓవర్లో బౌండరీతో అతడు 95కి రాగా.. అప్పటికే అకాశం మబ్బుపట్టడంతో.. అంపైర్లు ముందుగానే టీ సెషన్ ప్రకటించారు.
జైస్వాల్, ఫెర్నాండోకు జరిమానా..!
టీమిండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్-అసితా ఫెర్నాండో మైదానంలో పడిన గొడవను ఐసిసి సీరియస్గా తీసుకుంది. ఇది ఐసీసీ కోడ్ ఉల్లంఘన క్రిందకు వస్తుందని ఇందుకు భారీ జరిమానా విధిస్తున్నట్లు తాజా ప్రకటించింది. యశస్వీ, ఫెర్నాండో మ్యాచ్ ఫీజులో 25శాతం కోతతోపాటు ఒక డీ మిరిట్ పాయింట్ కేటాయిస్తున్నట్లు అందులో పేర్కొంది. మ్యాచ్ రిఫరీ ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసిసి అందులో పేర్కొంది. కొలంబో టెస్టులో తొలిరోజు మైదానంలో గొడవకు దిగిన ఇద్దరూ రిఫరీ ముందు తమ పొరపాటును అంగీకరించారని, దాంతో.. మరోసారి ఇలాంటి తప్పిదానికి పాల్పడకుండా మ్యాచ్ ఫీజులో కోత విధించినట్లు పేర్కొంది.
స్కోర్బోర్డు...
ఇండియా తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి)ఫెర్నాండో 45, కెఎల్ రాహుల్ (సి)డిక్వెల్లా (బి)లాహిరు 18, పడిక్కల్ (బి)నువాంత 117, శుభ్మన్ గిల్ (సి)డిక్కెల్లా (బి)ఫెర్నాండో 50, రిషబ్ పంత్ (సి)ఉదాన (బి)నువాంత 63, జడేజా (బి)ఫెర్నాండో 43, జురెల్ (నాటౌట్) 115, సురాన్ష్ జైన్ (సి)కమిల్ మిశ్రా (బి)ఫెర్నాండో 6, మానవ్ సుతార్ (సి)డిక్వెల్లా (బి)జయసూరియ 18, సిరాజ్ (ఎల్బి)జయసూరియ 3, ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 4, అదనం 21. (138ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 503 పరుగులు.
వికెట్ల పతనం: 1/37, 2/66, 3/186, 4/281, 5/296, 6/307, 7/419, 8/458, 9/489
బౌలింగ్: ఫెర్నాండో 29-5-106-4, లాహిరు 20-4-68-1, జయసూరియ 42-7-132-2, నువాంత 38-3-154-2, దినుషా 3-0-8-0, ధనుంజయ 2-0-8-0, మిశ్రా 4-0-16-0.








కామెంట్లు (0)