- గ్లాస్గో కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్లో సత్తా
గ్లాస్గో (స్కాట్లాండ్) : భారత క్రీడా దిగ్గజం, స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా మూడోసారి పసిడి పతకం సాధించింది. 2018 గోల్డ్కోస్ట్, 2022 బర్మింగ్హామ్లో బంగారు పతకాలు సాధించిన మీరాబాయి చాను.. 2026 గ్లాస్గోలోనూ పసిడి పతకంతో హ్యాట్రిక్ గోల్డ్ కొట్టింది. వెయిట్లిఫ్టర్ రిషికాంత సింగ్ సిల్వర్ మెడల్తో భారత్కు డబుల్ డిలైట్ అందించాడు. మీరాబాయి చాను పసిడి ఫేవరెట్గా బరిలోకి దిగి అంచనాలను అందుకుంది. స్నాచ్ విభాగంలో నేరుగా 82 కేజీలు ప్రయత్నించిన మీరాబాయి చాను తొలి రెండు ప్రయత్నాల్లో నిరాశపరిచింది. మూడో ప్రయత్నంలో ఏకంగా 85 కేజీలు ఎత్తిపడేసింది. క్లీన్ అండ్ జెర్క్లోనూ తొలి ప్రయత్నంలో సౌకర్యవంతంగా కనిపించలేదు. కానీ 105 కేజీలు ఎత్తేసి కామన్వెల్త్ క్రీడల చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల 48 కేజీల విభాగంలో పోటీపడిన మీరాబాయి చాను.. సహచర వెయిట్ లిఫ్టర్ల కంటే ఎంతో (ఓవరాల్గా 190 కేజీలు) ఎక్కువ బరువులు ఎత్తింది. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో పోటీ ఇతరులతో కాదు తనతోనే తనకు పోటీ అని చెప్పకనే చెప్పింది.
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా మహిళల వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో 190 కేజీల బరువు ఎత్తి భారత్కు మీరాబాయి తొలి స్వర్ణం అందించింది. రూత్ అసుక్వో న్యోంగ్ (నైజీరియా, 168 కేజీలు) రజతం, ఐరీన్ జేన్ హెన్రీ (మలేసియా, 167 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. రెజ్లర్లు సుశీల్ కుమార్ (2010, 2014, 2018), వినేశ్ ఫొగాట్ (2014, 2018, 2022) తర్వాత కామన్వెల్త్ క్రీడల్లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్స్ సాధించిన మూడో భారత అథ్లెట్గా చాను రికార్డు సృష్టించింది.







కామెంట్లు (0)