- డిఎస్పిపై విచారణకు ప్రభుత్వం వెనకడుగు: వైఎస్ జగన్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో అక్షరాస్యత 82.1 శాతం అనేది అబద్ధమని, ఈ ఏడాది ఇంకా పూర్తి కాకుండానే అక్షరాస్యత గణాంకాలు విడుదల చేయకుండానే ఇలాంటి ప్రకటన చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని మాజీ సిఎం జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. 2024లో 72.6 శాతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 2026లో 82.1 శాతానికి పెరిగిందని విద్యాశాఖ మంత్రి ప్రకటించడం సరికాదని ఆ పోస్ట్లో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పరిధిలో ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన సర్వే ఆధారంగా పిఎల్ఎఫ్ఎస్ 2023-24 వార్షిక నివేదికను రూపొందించారని, జూన్ 2023 నుంచి జూన్ 2024 మధ్య కాలానికి సంబంధించిన ఈ నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో ఏడు సంవత్సరాలు పైబడినవారి అక్షరాస్యత రేటు 72.6 శాతమని పేర్కొన్నారు. 2018-19లో 69.1 శాతంగా ఉన్న ఈ రేటు 2023-24 నాటికి 72.6 శాతానికి చేరిందని వివరించారు. 2025 జనవరి నుండి డిసెంబర్ 2025 మధ్య ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన 2025 వార్షిక నివేదికను 2026 జూలై రెండున విడుదల చేశారని, దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏడుసంవత్సరాలు పైబడినవారి అక్షరాస్యత రేటు 71.4 శాతం మాత్రమేనని తెలిపారు. అధికారిక గణాంకాలు ఇంత స్పష్టంగా అందుబాటులో ఉన్నప్పటికీ, 82.1 శాతం అంటూ తప్పుడు లెక్కలతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. విద్యాశాఖ మంత్రి ‘రెడ్బుక్ పాలన’పై సమయం వెచ్చించడం మానుకుని, తన శాఖపై ఎక్కువ సమయం, శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఇంకెన్నాళ్లు అడ్డుకుంటారు
మెగా డిఎస్సి స్కాంలో అర్హత లేనివారికి ఉద్యోగాలు కట్టబెట్టారంటూ సాక్ష్యాలు బయటకు వస్తున్నా, ఈ వ్యవహారాన్ని సిబిఐ విచారణకు ఇవ్వకుండా ఇంకెన్నాళ్లు తప్పించుకుంటారని జగన్ ప్రశ్నించారు. మెగా డిఎస్సి నిజాయితీపరులైన అభ్యర్థుల పాలిట “దగా” అని తేలిపోయిందని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ఒక అభ్యర్థికి తన కేటగిరీ ప్రకారం టెట్లో 75 మార్కులు రావాల్సి ఉండగా 65 మార్కులే వచ్చినా స్పోర్ట్స్ కోటాలో ఎస్జిటి పోస్టు ఎలా ఇచ్చారని తెలిపారు. వన్-టు-వన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి మరీ, అర్హత లేదని తెలిసి కూడా, పోస్టు ఎలా ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.








కామెంట్లు (0)