ఫ్యాక్టరీ డైరెక్టర్కు సిఐటియు వినతిపత్రం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖ స్టీల్ ప్లాంట్లో జూన్ 8న జరిగిన ప్రమాదానికి బాధ్యులైన స్టీల్ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సిఐటియు కోరింది. మంగళవారం సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ నర్సింగరావు, ఎవి నాగేశ్వరరావు ఎపి ఫ్యాక్టరీస్ డైరెక్టర్ను కలసి వినతిపత్రం అందజేశారు. వైజాగ్ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు మరణించారని . ఈ ఘటనపై ఉక్కు మంత్రిత్వ శాఖ ముగ్గురు సభ్యుల కమిటీని నియమించిందని, ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ప్రకటించలేదని తెలిపారు. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ప్రమాదానికి గల కారణాలను నేటికీ వెల్లడించకపోవడం అన్యాయమన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ట్రేడ్ యూనియన్లు, కార్మికులు నిస్సందేహంగా ప్రకటించారన్నారు. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఇనుప ద్రావణం ఉండే లాడిల్కు కనీసం కవర్ను కూడా ఉపయోగించలేదన్నారు. విధి విధానాల ప్రకారం ప్రమాదానికి ఆస్కారం ఉండే ప్రతి డిపార్ట్మెంట్లో అంబులెన్స్లు ఉండాలని కోరారు. ప్రమాదం జరిగిన రోజున ఎస్ఎంఎస్-1 వద్ద అంబులెన్స్ కూడా లేదన్నారు. తక్షణ చికిత్స కోసం ఐహెచ్ఎల్ ఆసుపత్రిలో కాలిన గాయాలకు చికిత్స చేసే యూనిట్ పనిచేయడం లేదన్నారు. భద్రతపై గత సంవత్సరం ఫ్యాక్టరీల జాయింట్ డైరెక్టర్ మెరుగుదల కోసం నోటీసునిచ్చినా యాజమాన్యం పట్టించుకోలేదని తెలిపారు. నోటీసుపై యాజమాన్యం స్పందించకపోతే చర్యలు చేపట్టాల్సిన ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ చోద్యం చూసింది తప్ప చర్యలు తీసుకోలేదన్నారు. ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ సకాలంలో స్పందించినట్లయితే ఘోరమైన ప్రమాదం జరిగి ఉండేది కాదని తెలిపారు. దానిపై ఫ్యాక్టరీస్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణమే ప్రమాదాలు నియంత్రించడానికి తగిన చర్యలు చేపడతామని, యాజమాన్యం రక్షణ చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ చ్చినట్లు సిఐటియు విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.








కామెంట్లు (0)