3 నెలల కనిష్టానికి పతనం
హెచ్ఎస్బిసి పిఎంఐ వెల్లడి
బెంగళూరు : భారత ప్రయివేటు రంగం మందగించింది. డిమాండ్ తగ్గడం, వ్యాపార విశ్వాసం సన్నగిల్లడంతో జూన్ నెలలో ప్రయివేటు రంగ కార్యకలాపాలు గత మూడు నెలల్లోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయని హెచ్ఎస్బిసి పిఎంఐ సర్వే వెల్లడించింది. ఎస్అండ్ పి గ్లోబల్ రూపొందించిన హెచ్ఎస్బిసి ఫ్లాష్ ఇండియా కాంపోజిట్ పిఎంఐ సూచీ మే నెలలోని 59.3 పాయింట్ల నుంచి జూన్లో 57.4 పాయింట్లకు పడిపోయింది. పిఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే వృద్ధిగానే పరిగణించినప్పటికీ.. తగ్గుదల మందగమనాన్ని సూచిస్తుంది.
ప్రధానంగా సేవల రంగం, తయారీ రంగం రెండింటిలోనూ వృద్ధి వేగం తగ్గడం ఈ మందగమనానికి ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. సేవల రంగం పిఎంఐ17 నెలల కనిష్టానికి (57.3) చేరుకోగా.. తయారీ రంగం పిఎంఐ 55.0 నుంచి 54.5 పాయింట్లకు జారింది. మార్చి తర్వాత కొత్త ఆర్డర్ల వృద్ధి అత్యంత నెమ్మదిగా నమోదైంది. మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీ, గ్యాస్ కొరత వంటి సమస్యలు వ్యాపార విస్తరణకు అడ్డంకులుగా మారాయని కంపెనీలు పేర్కొన్నాయి.
అంతర్జాతీయ వాణిజ్యం విషయానికి వస్తే సేవల రంగంలో ఎగుమతులు కొంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. తయారీ రంగంలో ఎగుమతి ఆర్డర్లు మార్చి 2023 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. డిమాండ్ మందగించడం వల్ల నియామక ప్రక్రియపై కూడా ప్రభావం పడింది. జూన్లో ఉద్యోగకల్పన అత్యంత స్వల్పంగా నమోదైంది. తయారీ, సేవల రంగాల్లో కొత్త నియామకాలు గత డిసెంబర్ తర్వాత అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వస్తువుల తయారీదారుల సెంటిమెంట్ గత నాలుగేళ్లలో కనిష్ట స్థాయికి పడిపోవడం గమనార్హం.









కామెంట్లు (0)