- నిమ్మకూరులో ఐఐటి జెఇఇ, నీట్ అకాడమీ ఏర్పాటు
- సమీక్షలో మంత్రి లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పరంగా వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఎపిరెసిడెన్షియల్ స్కూళ్లల్లో కంప్యూటర్ ల్యాబ్స్, ఎఐ స్కిల్లింగ్ తప్పనిసరి చేయాలని విద్యాశాఖమంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అకడమిక్ ఎక్సలెన్స్ (విద్యాపరమైన ప్రతిభ)పై దృష్టి సారించాలని అధికారులు, ఉపాధ్యాయులను కోరారు. ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం లోకేష్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిభావంతులను తయారుచేసే కేంద్రాలుగా ఈ పాఠశాలలు మారాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ ఎక్సలెన్స్ పై దృష్టి సారించాలని చెప్పారు. ఈ పాఠశాలలు ఉన్న ప్రాంతాల్లో ఇండస్ట్రీ డిమాండ్ కు అనుగుణంగా వృత్తివిద్యా కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ అందించాలని తెలిపారు.10 స్కూళ్లను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లుగా అభివృద్ధి చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. కృష్ణాజిల్లా నిమ్మకూరు ఎపిఆర్జెసి కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఐటి-జెఇఇ,నీట్ అకాడమీ ఏర్పాటుకు, 6 రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేసేందుకు సమావేశం ఆమోదించింది. జగ్గంపేట నియోజకవర్గంలోని స్కూల్ లో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసి, ఎడ్యుకేషన్ మరియు క్రీడా హబ్ గా తీర్చిదిద్దడానికి గల అవకాశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది స్టాఫింగ్ ప్యాట్రన్ కు ఆమోదం తెలిపారు. సిబ్బంది వయోపరిమితి 62ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది.
ఇంటర్ మూల్యాంకన సిబ్బందికి రెమ్యునరేషన్ పెంపు
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో పాల్గొన్న సిబ్బందికి భత్యాన్ని 25శాతం వరకు పెంచే ప్రతిపాదనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పాలకవర్గం ఆమోదం తెలిపింది. బోర్డు 78వ పాలకవర్గ సమావేశం లోకేష్ అధ్యక్షతన జరిగింది. మూల్యాంకనంలో తీవ్రమైన తప్పిదాలకు పాల్పడే సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో 1978 నుంచి ఇప్పటివరకు జారీచేసిన సర్టిఫికెట్లన్నింటినీ డిజిటలైజ్ చేసి, బ్లాక్ చైన్ టెక్నాలజీతో అనుసంధానించాలని తీర్మానించింది. సిబ్బందికి పదవీవిరమణ వయోపరిమితి 62 ఏళ్లకు పెంచేందుకు ఆమోదం. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో థియరీ సబ్జెక్టులకు 32పేపర్ల జవాబు పత్రం అందించేందుకు తీర్మానం. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జే శ్యామలరావు, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఇంటర్మీడియట్ డైరెక్టర్ పి రంజిత్ బాషా, ఓపెన్ స్కూల్స్ సెక్రటరీ ఆర్ నర్సింహారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎస్ విజయభాస్కర్ రావు, పలు యూనివర్సిటీలు విసిలు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)