• డిఎస్సిపై ఉభయ సభల్లో సర్కారు భిన్న వైఖరి
• ఎపిపిఎస్సిలో అక్రమాలపై ఎవరి వాదన వారిదే..
• మండలిలో మొక్కుబడిగా సభా కార్యకలాపాలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారం ముగిశాయి. సోమవారం ప్రారంభమైన సభా కార్యకలాపాలు బిఎసిలో తీసుకున్న నిర్ణయం మేరకు కేవలం నాలుగు రోజులపాటు జరిగాయి. ఈసారి శాసన మండలిలో మాత్రం సభా కార్యకలాపాలు మొక్కుబడిగా నిర్వహించారు. డిఎస్సి నియామకాల్లో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్తో నాలుగు రోజుల పాటు మండలిలో వైసిపి సభా కార్యకలాపాలను అడ్డుకుంది. మండలిలో వైసిపి ఆందోళనను కూటమి ప్రభుత్వం తేలికగా తీసుకున్నట్టు కన్పిస్తుంది. డిఎస్సిపై తొలి రోజు అసెంబ్లీలో చర్చించిన ప్రభుత్వం మండలిలో ఈ అంశంపై చర్చకు సుముఖత వ్యక్తంచేయలేదు. సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ డిఎస్సి పరీక్షలపై సుదీర్ఘ వివరణ ఇచ్చి వైసిపి తీరుపై ఎదురుదాడి చేశారు. ప్రధానంగా క్రీడా కోటాలో జరిగిన నియమాకాల్లో ఎక్కువగా అక్రమాలు జరిగాయని వైసిపి పేర్కొనగా, పి.వి.సింధూ లాంటి అంతర్జాతీయ క్రీడాకారులతో పోల్చి డిఎస్సి క్రీడాకోటాకు ముడిపెట్టి వివరణ ఇచ్చారు. మండలిలో డిఎస్సి పై 20వ తేదీన చర్చిస్తామని సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ మండలి బిఎసి సమావేశంలో హామీ ఇచ్చారు. కానీ గురువారం మండలి ఎజెండాలో ఈ అంశం లేకుండానే ముగించారు. అలాగే వైసిపి హయాంలో ఎపిపిఎస్సి పరీక్షల్లో జరిగిన అక్రమాలపై శాసనసభలో సిఎం చంద్రబాబు నాయుడు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. సిట్ నివేదిక ఆధారంగా అప్పటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుం టామని తెలిపారు. అయితే డిఎస్సితోపాటు ఎపిపిఎస్సి పరీక్షలపై మండలిలో చర్చకు తాము సిద్ధమేనని మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. అయినా ఈ రెండు అంశాలపై మండలిలో చర్చకు కూటమి ప్రభుత్వం ముందుకు రాలేదు. ప్రతిపక్షం హాజరుకాని శాసనసభలో సుదీర్ఘ వివరణలు ఇచ్చి ఏకపక్షంగా ఆయా అంశాలపై ప్రభుత్వం మమ అనిపించింది. ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలకు దీటైన జవాబులు ఇచ్చి ప్రజలకు తమ నిజాయితీని నిరూపించుకోవాల్సిన పాలక పక్షం మండలిలో ఆ దిశగా అడుగులువేయలేకపోయింది. అలాగే మరో కీలకమైన అంశంగా ఉన్న బిసిల రిజర్వేషన్లపై కూడా ప్రభుత్వం శాసనసభలోనే చర్చ నిర్వహిం చింది. బిసిల రిజర్వేషన్ల ఖరారుకు నియమించిన రాజీవ్రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను మాత్రం బహిర్గతం చేయకుండానే ఈ అంశంపై శాసనసభలో చర్చించారు. మంత్రి వర్గ సమావేశంలో కూడా స్థానిక సంస్థల్లో (రూరల్) 34 శాతం, పట్టణాల్లో 33.33 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశారు. కానీ మంత్రి మండలి సమావేశంలో కానీ, శాసనసభలో కానీ రాజీవ్రంజన్ మిశ్రా కమిషన్ : నివేదిక ప్రస్తావన లేదు. కమిషన్ ఏం చెప్పింది? నివేదికలో ఏముందో బహిర్గతం చేయకుండానే బిసిల రిజర్వేషన్లపై జీవోలు కూడా ఇచ్చేశారు. మొత్తంగా డిఎస్సి,ఎపిపిఎస్సి, బిసిల రిజర్వేషన్ల అంశాలపై మండలిలో కనీసం చర్చ జరపలేదు. అలాగే మండలిలో డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఎన్నిక, శుభాకాంక్షలు తెలిపే కార్యక్రమాన్ని కూటమి పార్టీలు బహిష్కరించాయి. వర్షాకాల సమావేశంలో మొత్తం 12 బిల్లులు ఉభయ సభల్లో ఆమోదించుకున్నారు. మండలిలో బిల్లుల ఆమోదం మొత్తం గందరగోళం మధ్య జరిగింది. విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ బిల్లును రెండు సభల్లో ఆమోదించారు.





కామెంట్లు (0)