ముగ్గురు వ్యవసాయ కార్మికులు దుర్మరణం
మరో ఏడుగురికి గాయాలు
ప్రజాశక్తి - రాజానగరం(తూర్పు గోదావరి జిల్లా) : తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యవసాయ కార్మికులు మృతి చెందారు. మరో ఏడుగురు వ్యవసాయ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... సామర్లకోటకు చెందిన పది మంది వ్యవసాయ కార్మికులు గుంటూరు సమీపంలో కొల్లూరు గ్రామంలో పనులకు వెళ్లారు. మంగళవారం తెల్లవారు జామున వారంతా ట్రక్ ఆటోలో సామర్లకోటకు తిరుగుపయనమయ్యారు. సామర్లకోట - పెద్దాపురం ఎడిబి రోడ్డులో ముకుందవరం గ్రామ సమీపానికి వచ్చే సరికి ఆటో టైరు పేలిపోవడంతో అది అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మసకపల్లి బాలు (21), తాటపూడి రాజేష్ (22), మురమళ్ల రాజ్ కుమార్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిని 108లో పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనపర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రంగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.








కామెంట్లు (0)