సుంకరవారి ఎడ్లకు ప్రథమ బహుమతి
ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని చొప్పెల్లలో వేంచేసి యున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన ఎడ్లపట్టు, పరుగు పోటీలు ఉత్సాహంగా సాగాయి. గ్రామ వార్షిక జాతరలో భాగంగా నిర్వహించిన ఈ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రైతులు, ఎడ్ల యజమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పోటీలను తిలకించేందుకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. పోటీల్లో చొప్పెల్లకు చెందిన సుంకర వెంకట సాయినాథ్ ఎడ్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నాయి. తోకలంకకు చెందిన గడ్డం ప్రసాద్ ఎడ్లు ద్వితీయ బహుమతిని, సీతానగరం మండలం వంగలపూడికి చెందిన చంద్రాల శ్రీనివాస్ ఎడ్లు తృతీయ బహుమతిని సాధించాయి. విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపికలను నిర్వాహకులు అందజేసి ఘనంగా సత్కరించారు. గ్రామీణ సంస్కృతి, రైతాంగ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ ఎడ్లపట్టు పోటీలను ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన గ్రామ పెద్దలు, దాతలు, యువకులు, పాల్గొన్న రైతులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.









కామెంట్లు (0)