రేపు విద్యాసంస్థల బంద్
విద్యార్ధి, యువజన సంఘాల పిలుపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నేడు (23వ తేది) చలో లోక్ భవన్, రేపు (24వ తేది) విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్ధి, యువజన సంఘాలు ప్రకటించాయి. ఈ కార్యక్ర మాలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, పిడిఎస్యు, ఎఐఎస్ఎ, పిడిఎస్యు,డివైఎఫ్ఐ,ఎఐవైఎఫ్ సంఘాలు పిలుపునిచ్చాయి. విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు పోస్టర్ను విడుదల చేశారు. అనంతరం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్ మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అంధకారంలోకి నెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారిపై నిరంకుశ పద్ధతిలో నిర్బంధాన్ని విధిస్తుందని విమర్శించారు. ఛలో పార్లమెంట్ కార్యక్రమంలో విద్యార్థులు, బాష్ప వాయువులు ప్రయోగించారని, విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యేలా డిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎఐఏస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి.వలరాజు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న పరిణామాలపై కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. నీట్ పరీక్షా లీకేజ్ కారణంగా రాష్ట్రంలో 50 వేల మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతలు నోరుమేదపాలని డిమాండ్ చేశారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ 14 ఏళ్లల్లో దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీకేజ్ గురయ్యాయని, ఇది కోట్లలో వ్యాపారం అని పేర్కొన్నారు. పిడిఎస్యు రాష్ట్ర కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం యువత పోరాటంతో భయానికి లోనవుతుందనేదని అర్థమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కోశాధికారి సుభాని, ఏఐఎస్ఎ రాష్ట్ర నాయకులు మహేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి, జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర రావు, నాయకులు ప్రణీత, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు సునీల్, డివైఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)