- ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : డీఎస్సీ అక్రమాలపై వైసిపి సిబిఐ విచారణ కోరుతుంటే కూటమి ప్రభుత్వం బుకాయిస్తోందని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు, డీఎస్సీ, ఏపీపీఎస్సీలపై దమ్ముంటే సీబీఐ విచారణ వేయాలని వైఎస్ జగన్ సవాల్ విసిరారని, అయినా కూటమి ముందుకు రావడం లేదని అన్నారు. ఏపీపీఎస్సీపై సిట్లు వేసి కాలయాపన చేస్తున్నారని, డీఎస్సీ అక్రమాలపై నోరు మెదపడం లేదని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పరీక్ష లేకుండా 372 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని విమర్శించారు. పరీక్ష రాయకుండా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఏ రూల్ బుక్లో రాసి ఉందో లోకేష్ చెప్పాలని కోరారు. స్పోర్ట్స్ కోటా కింద 372 పోస్టుల కోసమే నాలుగు జీవోలు తెచ్చారని అన్నారు. తొలి మెరిట్ లిస్ట్లో మొదటి ర్యాంకు వచ్చిన వారి పేర్లు రెండో మెరిట్ లిస్ట్లో గల్లంతయ్యాయని పేర్కొన్నారు. డీఎస్సీ స్కామ్ బయటపడగానే నాలుగేళ్లుగా పనిచేస్తున్న 163 మంది గ్రూప్-1 ఉద్యోగులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. 2018 నాటి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్పై హైకోర్టు ఆదేశాల మేరకే నియామకాలు పూర్తయ్యాయని, ఏపీపీఎస్సీపై వేసిన మొదటి సిట్ నివేదిక ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదని రెండో సిట్ వేశారని తెలిపారు. తప్పులు లేవని మొదటి సిట్ చెబితే, తమకు అనుకూల రిపోర్టు కోసం రెండో సిట్కు గైడ్లైన్స్ ఇచ్చారని అన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ, ఏపీపీఎస్సీ రెండింటిపైనా సీబీఐ విచారణ వేయాలని కోరారు.
పరిశ్రమలను భయపెట్టి తరిమేస్తున్నారు : పుత్తా
కూటమి నేతల కప్పం డిమాండ్లతో పారిశ్రామిక రంగం కుదేలయిందని, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. 24 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు అనేది పచ్చి అబద్ధమని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల్లో పదిశాతం ఇచ్చినా చూపించాలని, దమ్ముంటే వారి వివరాలను ప్రజల ముందు ఉంచాలని కోరారు. రాష్ట్రంలో ఏ ఒక్క సిమెంట్ కంపెనీ బతికే పరిస్థితి లేదని, పరిశ్రమలు తరలిపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.







కామెంట్లు (0)