మరో బాలిక కోసం కొనసాగుతున్న గాలింపు
ప్రజాశక్తి-యలమంచిలి : పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో గోదావరి వంతెనపై నుంచి ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలు నదిలోకి దూకిన ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. నంబూరి శ్రీనివాస్ (45), ఆయన కుమారుడు నంబూరి ఈశ్వర్ (16) మృతదేహాలను ఆదివారం ఉదయం పాలకొల్లు అగ్నిమాపక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మరో కుమార్తె నంబూరి నిత్య (15) ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. తణుకు పట్టణానికి చెందిన నంబూరి శ్రీనివాస్, ఆయన భార్య పద్మిని (42), కుమారుడు ఈశ్వర్, కుమార్తె నిత్య శనివారం రెండు ద్విచక్ర వాహనాలపై చించినాడకు వచ్చారు. అనంతరం వంతెనపైకి వెళ్లి నలుగురూ గోదావరిలోకి దూకారు. ఈ ఘటనను గమనించిన అక్కడి మత్స్యకారులు పడవపై వెళ్లి పద్మినిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. శ్రీనివాస్, ఈశ్వర్, నిత్య గల్లంతయ్యారు.
అపస్మారక స్థితిలో ఉన్న పద్మినిని 108 అంబులెన్స్లో తొలుత పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి, అనంతరం తణుకు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది పడవల సహాయంతో శనివారం పొద్దుపోయే వరకు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం శ్రీనివాస్, ఈశ్వర్ మృతదేహాలు లభ్యమయ్యాయి. నిత్య కోసం గాలింపు కొనసాగుతోంది. శ్రీనివాస్, పద్మిని తణుకు పట్టణంలో పాలు, కిరాణా వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం అంతంతమాత్రంగా ఉండటం, అప్పుల పాలవడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతోనే కుటుంబం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం..







కామెంట్లు (0)