నల్లమడ రైతు సంఘం డిమాండ్
15వ రోజుకు చేరిన రైతుల రిలే నిరాహార దీక్షలు
ప్రజాశక్తి–పర్చూరు : గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించేందుకు అవసరమైన భూసేకరణ కోసం ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని నల్లమడ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పర్చూరు ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 15వ రోజుకు చేరుకున్నాయి. కృష్ణా జలాలు పర్చూరుకు చేరే వరకు నిరసనలు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ కొల్లా రాజమోహన్ మాట్లాడుతూ గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఈ ప్రాంతంలో భూసేకరణ కోసం ప్రభుత్వం తక్షణమే గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. పాలకులు ‘పది రోజుల్లో చేస్తాం’, ‘అదిగో చేస్తాం’ అంటూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పర్చూరు ప్రాంత రైతాంగానికి, ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు రైతుల నిరసన దీక్షలు కొనసాగుతాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీక్షలో దేవరపల్లి గ్రామానికి చెందిన రైతులు తోకల కృష్ణమోహన్, గండు భాస్కర్రావు, తోకల తిరుపతిస్వామి, దేవరపు లక్ష్మీనారాయణ, నాయుడు సుబ్బారావు, తెలగతోటి పేతురు, గుజ్జర్లపూడి విజయ్కుమార్, గుజ్జర్లపూడి ఆనందరావు, జూపూడి ఇమ్మాన్యుయేల్, తోకల అరవింద్, మత్తే డేవిడ్, జాలాది సుధీర్, కొల్లా కృష్ణారావు, తోకల శివమణికంఠ, ఎం.చంద్రకిరణ్, ఎం.పవన్కళ్యాణ్, పి.కామేష్, ముప్పాళ్ల సురేష్, దుడ్డు కిరణ్ పాల్గొన్నారు. దీక్షలకు సంఘీభావం తెలిపిన వారిలో కోట హరిప్రసాద్, కటారి అప్పారావు, పర్చూరు నియోజకవర్గ వైసిపి మాజీ ఇన్చార్జి రావి రామనాథంబాబు, యద్దనపూడి హరిప్రసాద్, లంకా శివ, రావి రవీంద్రబాబు, ఆర్.ప్రసాద్, షేక్ బాషా ఉన్నారు. కార్యక్రమంలో పర్చూరు ప్రాంత రైతులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)