ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని ఇకపై ప్రతి ఏడాది సెప్టెంబరు 21న రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురజాడ వెంకట అప్పారావు అందించిన అపారమైన సాహిత్య, సామాజిక, సాంస్కృతిక సేవలను పరిగణనలోకి తీసుకుని, ఆయన వారసత్వంతో ప్రజలకు ఉన్న అనుబంధం, భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో ప్రభుత్వ వేడుకగా గురజాడ జయంతిని నిర్వహిస్తూ వచ్చారు. తాజాగా యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ చేసిన ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం.. ప్రతి ఏడాది సెప్టెంబరు 21న గురజాడ జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేసింది.
మంత్రి కొండపల్లి హర్షం
తెలుగు సాహిత్యానికి, సామాజిక చైతన్యానికి విశిష్ట సేవలందించిన మహాకవి గురజాడ వెంకట అప్పారావు గారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడం పట్ల ఎంఎస్ఎంఇ, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. గురజాడ గారి జయంతిని రాష్ట్ర స్థాయి వేడుకగా నిర్వహించాలని తాము చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం ప్రకటించినందుకు శుక్రవారం ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. గురజాడ రచనలు, ఆలోచనలు నేటి యువతకు చేరేలా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గురజాడను స్మరించుకోవడం అంటే తెలుగు భాషపై ప్రేమను, సమాజం పట్ల బాధ్యతను, మానవతా విలువలను భవిష్యత్ తరాలకు అందించడమే అని మంత్రి స్పష్టం చేశారు.








కామెంట్లు (0)