- మంత్రి ఎన్ఎండి ఫరూక్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల గౌరవ వేతనాన్ని రూ.50,000 నుంచి రూ.75,000 కు ప్రభుత్వం పెంచిందని న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రవాణా భత్యాన్ని రూ.10 వేలు కొనసాగించుటకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ మేరకు గౌరవ వేతనం పెంపు, రవాణా భత్యం తో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని మంత్రి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల కోర్టులు పని చేస్తున్నాయని తెలిపారు. 2017 తర్వాత ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యూడిషల్ మేజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంచలేదన్నారు. ఈ నేపథ్యంలో వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్లు చేసిన విన్నపాన్ని హైకోర్ట్ పరిశీలించి 34 కోర్టుల్లో పనిచేస్తున్న మేజిస్ట్రేట్ ల నెలసరి గౌరవ వేతనాన్ని పెంచేందుకు సిఫార్సు చేసినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ల నెలసరి గౌరవ వేతనాన్ని రూ. 50,000 ల నుండి 75,000 లకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. కాగా ఇటీవల సెకండ్ క్లాస్ స్పెషల్ మేజిస్ట్రేట్ల గౌరవ వేతనం నెలకు రూ.30,000 నుండి రూ.45,000 కు పెంచిన విషయాన్ని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు.







కామెంట్లు (0)