- రౌండ్ టేబుల్ లో వక్తలు
విజయవాడ: పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని ఏపీ రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతుల సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రౌండ్టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. నిర్వాసితుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని సంఘాల ప్రతినిధులు కోరారు. నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం అందించి, పునరావాస (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీని పూర్తిగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 2019 నుంచి 2026 మధ్య 18 సంవత్సరాలు నిండిన యువతను ప్రత్యేక కుటుంబాలుగా పరిగణించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని, రిజర్వాయర్లో నీటిని నింపే ముందే అర్హులైన నిర్వాసితులందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గెజిట్, అవార్డుల్లో నమోదుకాని అర్హులైన కుటుంబాలను జాబితాలో చేర్చి పరిహారం అందించాలని, పునరావాస కాలనీల్లో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించిన తర్వాతే నిర్వాసిత గ్రామాల నుంచి ప్రజలను తరలించాలని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి నిర్వాసిత కుటుంబానికి పూర్తి పారదర్శకతతో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు.








కామెంట్లు (0)