హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ప్రజాశక్తి అమరావతి : రాష్ట్రంలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలన్నీ ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం నియంత్రణలో ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని వివరించింది. ఈ వివరాలను నమోదు చేసిన హైకోర్టు.. స్థానిక ఎన్నికల నిర్వహణపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 6కు వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. బిసి జనగణన, బిసి రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బిసి సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు దాఖలు చేసిన వ్యాజ్యంతో పాటు, ఎన్నికలను వెంటనే నిర్వహించాలని న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిల్పై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో యోగేష్ తరఫు న్యాయవాది స్థానిక సంస్థల పాలక మండళ్ల గడువు ముగిసినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదని, ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని వాదించారు. అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉందని, ప్రస్తుతం ఎస్ఐఆర్, బిసి జనాభా సర్వే, బిసి రిజర్వేషన్లపై ఏకసభ్య కమిషన్ ప్రక్రియలు కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది నర్సీపురం అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ జనవరిలోనే స్థానిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాలు సిద్ధం చేసినప్పటికీ ప్రస్తుతం అవన్నీ కేంద్ర ఎన్నికల సంఘం ఆధీనంలో ఉన్నాయని, ఎస్ఐఆర్ పూర్తయ్యే వరకు ముందుకు వెళ్లలేమని వివరించారు.






కామెంట్లు (0)