పోలీసుల అదుపులో నిందితుడు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన నర్సు (21) కేసు మిస్టరీ వీడింది. ఆమెను బిహార్కు చెందిన సైనా ఉల్లా అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. న్యాయం చేయాలని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.
కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన యువతి ఏడు నెలల క్రితం మహేశ్వరంలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. ఓ ఆస్పత్రిలో నర్సుగా చేరారు. అదే ఆస్పత్రికి చెందిన గదిలో ఉంటున్నారు. శనివారం మధ్యాహ్నం గదికి వెళ్లి.. మళ్లీ ఆస్పత్రికి తిరిగిరాలేదు. యాజమాన్యం ఫోన్ చేసినా స్పందించకపోవడంతో.. ఆమె ఉంటున్న గదికి సిబ్బందిని పంపించారు. గది తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో కిటికీ సందులోంచి చూడగా ఆమె నేలపై పడి ఉంది. తలుపు విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెంది ఉంది. సమాచారం అందుకున్న పహాడీషరీఫ్ పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఒంటిపై గాయాలు గమనించి.. ఆమె మృతిపై అనుమానముందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైనా ఉల్లా అనే వ్యక్తి కిటీకీ నుంచి నర్సు గదిలోకి దూకి.. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించగా.. గొంతు నొక్కి కేకలు వేయకుండా అడ్డుకోవడంతో ఆమె మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పారిపోతుండగా పట్టుకుని.. విచారించగా నేరం అంగీకరించాడు. సైనా ఉల్లా ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. న్యాయం చేయాలని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు.







కామెంట్లు (0)