- తాగునీటి ప్రాజెక్టు పనితీరుపై సమీక్ష
ప్రజాశక్తి - శ్రీకాకుళం : ఉద్దానం ప్రాంత ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన ఉద్దానం తాగునీటి ప్రాజెక్టును నాబార్డు ప్రధాన కార్యాలయ చీఫ్ జనరల్ మేనేజర్ సోమైందర్ సింగ్ తన బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. నాబార్డు గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కింద గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో అమలు చేసిన ఉద్దానం ప్రాంతానికి సురక్షిత తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనితీరును సమీక్షించారు. ఈ భారీ ప్రాజెక్టుకు మొత్తం రూ.700 కోట్లు అంచనా వ్యయం కాగా, నాబార్డు ఆర్ఐడిఎఫ్ కింద రూ.125 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించిందని తెలిపారు. హిరమండలం వంశధార రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటెక్వెల్, పంప్హౌస్, 529 మీటర్ల అప్రోచ్ బ్రిడ్జిని పరిశీలించారు. రిజర్వాయర్ నుంచి నీటిని సేకరించి మెళియాపుట్టిలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు తరలించే ప్రక్రియను అధికారులు వివరించారు. ప్రస్తుతం నీటిని పంపింగ్ చేస్తున్న 1,300 హెచ్పి సామర్థ్యం కలిగిన మూడు మోటార్ల ద్వారా నిమిషానికి సుమారు 57,805 లీటర్ల నీటిని మెళియాపుట్టి శుద్ధి కేంద్రానికి తరలిస్తున్నట్లు తెలిపారు. పర్యటనలో నాబార్డు డిడిఎం, ఆర్ఐడిఎఫ్ కన్సల్టెంట్, ఆర్డబ్ల్యుఎస్ డిఇ, ఇతర అధికారులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)