ప్రజాశక్తి-అమరావతి: అనుమతులు లేకుండా ఖనిజాలు తవ్వకం, నిల్వ చేయడం, రవాణాకు పాల్పడే వారిపై పెనాల్టీ, సీనియరేజ్ ఫీజు విధించే అధికారం మైనింగ్ శాఖ అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎపి మైనర్ మినరల్ కన్షెషన్ రూల్స్-1966లోని రూల్ 26, 34లకు సవరణలు చేస్తూ 2020 జూలై 1న ప్రభుత్వం జారీ చేసిన జీవో 35 చట్టబద్ధమైనదేనని తేల్చింది. ఎంఎండిఆర్ చట్టంలోని సెక్షన్లు 15, 23సి ప్రకారం అక్రమ మైనింగ్, నిల్వ, రవాణాను అరికట్టేందుకు నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. ఈ సవరణలు కేంద్ర చట్టానికి విరుద్ధమంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించింది. మైనింగ్ అధికారులు జారీ చేసిన డిమాండ్ నోటీసులపై సంబంధిత సంస్థలు తీర్పు ప్రతిని అందుకున్న 15 రోజుల్లో అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం చేసిన సవరణలు ఎంఎండిఆర్ చట్టానికి విరుద్ధమని, జరిమానాలు విధించే అధికారం క్రిమినల్ కోర్టులకు మాత్రమే ఉందని జెఎంబి రాక్స్, శ్రీ దుర్గా భవాని గ్రానైట్స్, జీఎస్ఆర్ స్టోన్ క్రషర్స్ తదితర సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనికి అనుకూలంగా సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసింది. ఈ అప్పీల్ విచారణలో జైలు శిక్ష అవసరమైన సందర్భాల్లోనే అధికారులు క్రిమినల్ కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని, పెనాల్టీ వసూలు చేసే అధికారం మాత్రం మైనింగ్ అధికారులకు ఉంటుందని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
Print Editionఅక్రమ ఖనిజ తవ్వకాలపై పెనాల్టీ అధికారం అధికారులదే : హైకోర్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 27, 2026, 11:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)