- పూర్తి చేసేందుకు మరో ఏడాది గడువు పెంచిన కేంద్రం
- పార్లమెంటులో సభ్యుల ప్రశ్నలకు సమాధానం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో: పోలవరం ఫేజ్-1 పూర్తికి మరో ఏడాది గడువు పెంచినట్లు కేంద్ర జలశక్తిశాఖ పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు కోసం గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2021-26 మధ్య) మొత్తం రూ.12,620.53 కోట్లు విడుదల చేశామని కేంద్రం వెల్లడించింది. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు జలవనరులశాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు ఫేజ్-1 సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. స్పిల్వే, ఎర్త్-కం-రాక్ఫిల్ డ్యామ్ పనులు చివరి దశకు చేరగా, నిర్వాసితుల పునరావాసం కింద ఇప్పటి వరకు 17,892 కుటుంబాలను మార్చామని, ఆర్అండ్ఆర్ పనుల కోసం రూ.1,373.01 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. ఫేజ్-1 పూర్తికి మార్చి 2026 గడువుతో పాటు మరో ఏడాది పొడిగింపును కేటాయించినట్లు వివరించారు. 2021-22 సంవత్సరాల్లో రూ.1,898 కోట్లు, 2022-23లో రూ.1,671 కోట్లు, 2023-24లో రూ.727 కోట్లు, 2024-25లో రూ.5,512 కోట్లు, 2025-26లో రూ.2,810 కోట్లు విడుదల చేసినట్లు సమాధానంలో పేర్కొన్నారు. స్పిల్వేకు సంబంధించి ఎర్త్ వర్కు 96.87 శాతం, కాంక్రీటు వర్కు 98.84 శాతం, స్టీలు వర్కు 92.95 శాతం పూర్తయినట్లు వివరించారు. ఎర్త్కం రాక్ ఫిల్ డ్యామ్లో ఎర్త్ వర్కు 75.67 శాతం, కాంక్రీటు వర్కు 81.99 శాతం, స్టీలు వర్కు 81.13 శాతం పూర్తయినట్లు వివరించారు. మెయిన్ కెనాల్స్ దాదాపు 98.96 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. మొత్తం 96,660 కుటుంబాలను తరలించాల్సి ఉండగా ఇప్పటి వరకూ 17,892 కుటుంబాలను మాత్రమే తరలించినట్లు తెలిపారు.








కామెంట్లు (0)