రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేసి ఖైదీలుగా జైల్లో నిర్బంధించిన ఆదివాసీలను, దళితులు, ప్రజాస్వామిక వాదులను తక్షణమే విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం ఆధ్వర్యాన జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. విజయవాడలోని బాలోత్సవ భవన్లో ఆదివారం జరిగిన ఈ సమావేశానికి ఆ సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, సిపిఎం రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు వి రాంభూపాల్, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్, ఎంసిపిఐ నాయకులు బాషా, విరసం అధ్యక్షులు రివేరా, పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ.. ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో నిర్బంధిస్తున్నారని తెలిపారు. రాజకీయ ఖైదీలుగా ఆదివాసీలే అధికంగా ఉన్నారని తెలిపారు. రెండున్నరేళ్లు సాగిన ఆపరేషన్ కగార్కు ముందు ఆదివాసీలను పెద్దయెత్తున అరెస్టులు చేసి విచారణ, ఇతర న్యాయ సహాయాలకు దూరం చేసి సుదీర్ఘకాలం జైళ్లలో కుక్కారని పేర్కొన్నారు. కోర్టులు విధిస్తున్న షరతుల వల్ల బెయిల్ వచ్చి విడుదలైన ఎందరో జైలు బయట కూడా ఆర్థిక, ఆరోగ్య పరమైన సమస్యలతో తమ వాళ్ళకు దూరంగా ఉండాల్సి వస్తోందన్నారు. రాజకీయ ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని సెప్టెంబరు 19న రాష్ట్ర వ్యాప్త ధర్నా విజయవాడలో నిర్వహించాలని సమావేశం అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో పికెఎం నాయకులు పద్మ, సీనియర్ జర్నలిస్టులు డ్యానీ, భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)