- నాన్ పర్మినెంట్ కార్మికుల కనీస హక్కుల కోసం ఐక్య పోరాటాలు చేపట్టాలి
- డబ్ల్యుటిడబ్ల్యుఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు సిడి.నందకుమార్
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : పోర్టుల ప్రైవేటీకరణను ప్రతిఘటించాలని, నాన్ పర్మినెంట్ కార్మికుల కనీస హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని వాటర్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుటిడబ్ల్యుఎఫ్ఐ) జాతీయ అధ్యక్షులు సిడి నందకుమార్ పిలుపునిచ్చారు. ఆ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత ప్రధాన, చిన్న పోర్టుల కార్మికుల నాలుగు రోజుల వర్క్షాప్ శనివారం ప్రారంభమైంది. దేశంలోని ప్రధాన, చిన్న, ప్రైవేట్ పోర్టులు, డాక్లు, కాంట్రాక్టు కార్మిక సంఘాల ప్రతినిధులు, ట్రేడ్ యూనియన్ నాయకులు ఈ వర్క్షాప్నకు హాజరయ్యారు. సీనియర్ నాయకులు విఎస్.పద్మనాభరాజు అధ్యక్షత వహించారు. వర్క్షాప్ను ప్రారంభించిన నందకుమార్ మాట్లాడుతూ... పోర్టు రంగంలో అమలవుతున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల కార్మికుల ఉద్యోగ భద్రత, వేతనాలు, సామాజిక భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. ప్రభుత్వ రంగ పోర్టులను, పోర్టు సేవలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను సమిష్టిగా ప్రతిఘటించాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రధాన, చిన్న, ప్రైవేట్ పోర్టులలో పనిచేస్తున్న నాన్ పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల కనీస హక్కులు, సమాన పనికి సమాన వేతనం, శాశ్వతీకరణ, సామాజిక భద్రత సాధన కోసం దేశవ్యాప్త ఐక్య పోరాటాలను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ.. పోర్టు కార్మికుల కనీస వేతనాల కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాలని కోరారు. ఇపిఎఫ్, ఇఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్, సెలవులు, ఉద్యోగ భద్రత వంటి హక్కులను అమలు కోసం అన్ని కార్మిక సంఘాలూ ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఈ వర్క్షాప్లో పోర్టు రంగంలో జరుగుతున్న మార్పులు, ప్రైవేటీకరణ ప్రభావం, ప్రధాన, చిన్న పోర్టుల పరిస్థితి, కాంట్రాక్టు కార్మికుల సమస్యలు, వేతన ఒప్పందాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రతా ప్రమాణాలు, పోర్టు కార్మికుల జాతీయ డిమాండ్ల ఛార్టర్, ట్రేడ్ యూనియన్ హక్కులు, భవిష్యత్ పోరాట కార్యాచరణ వంటి అంశాలపై నాలుగు రోజుల పాటు సమగ్ర చర్చలు జరుగనున్నాయి. కార్యక్రమంలో డబ్ల్యుటిడబ్ల్యుఎఫ్ఐ సంయుక్త కార్యదర్శులు సమర మండల్, బి.జగన్, సిఐటియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్కెఎస్వి.కుమార్, ఉపాధ్యక్షులు కెఎం.శ్రీనివాసరావు, నాయకులు సత్యనారాయణ (విశాఖపట్నం), తాతారావు (గంగవరం), కాకినాడ రమణ (కృష్ణపట్నం), వెంకటేశ్వర రావు (రామాయపట్నం), అమ్మన్నాయుడు (మూలపేట)తో పాటు దేశంలోని వివిధ ప్రధాన, చిన్న పోర్టుల కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.








కామెంట్లు (0)