టుబాకో బోర్డు ఎడితో రైతు సంఘాల సమావేశం
ప్రజాశక్తి-గుంటూరు : పొగాకు మార్కెట్లో సంక్షోభం నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు నిధులు కేటాయించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు టుబాకో కార్యాలయంలో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీతో మంగళవారం రైతు సంఘం నాయకులు సమావేశమై పొగాకు రైతుల సమస్యలను వివరించారు. ఇప్పటివరకు 17. 5 మిలియన్ల కేజీలు మాత్రమే కొనుగోలు జరిగాయని, గత ఏడాదితో పోల్చుకుంటే ఐదు శాతం మాత్రమేనని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకాశం జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, కార్యదర్శి జుజ్జురి జయంతిబాబు, వి.హనుమ రెడ్డి, విద్యాసాగర్, లలిత కుమారి మాట్లాడుతూ... పొగాకు ద్వారా ప్రభుత్వాలకు ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న నేపథ్యంలో రైతులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.500 కోట్ల వంతున నిధులు కేటాయించి మొత్తం రూ.1000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. పొగాకు బోర్డు, ఎస్టిసి, మార్క్ఫెడ్ వంటి ప్రభుత్వరంగ సంస్థల ద్వారా పొగాకును కొనుగోలు చేయాలని సూచించారు. ఒక క్వింటాకు కనీసం రూ.30వేలు లేదా, కిలోకు రూ.250 నుంచి రూ.380 వరకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. బుధవారం నుంచి ఒంగోలు కలెక్టరేట్ ఎదుట శాంతియుత దీక్షలను చేపట్టనట్టు తెలిపారు. నిధులను మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు. 25న జరిగే సమావేశంలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతు నాయకులకు విశ్వశ్రీ హామీ ఇచ్చారు.








కామెంట్లు (0)