ఒప్పందంలోనూ ప్రస్తావించని ప్రభుత్వం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ఇప్పుడు కొత్తగా వచ్చే విద్యుత్ బస్సుల్లో అమలు చేయడం లేదు. దీనిపై ఇటీవల జరిగిన చర్చలోనూ ఎపిఎస్ఆర్టిసి యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పిఎం ఇ-బస్ సేవా పథకం కింద కొనుగోలు చేస్తున్న కొత్త బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలు చేయడం సాధ్యం కాదని నిర్ణయించింది. ప్రస్తుతం ఎక్స్ప్రెస్ సర్వీసు నుంచి దిగువ సర్వీసులకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ పాలసీలో భాగంగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో వచ్చే బస్సుల్లో ఉచిత పథకాలు అమలు చేయడం లేదని సమాచారం. ప్రస్తుతం పినాకిల్ సంస్థతో ఆర్టిసి జిల్లాల వారీ అగ్రిమెంటు చేసుకుంటూ వస్తోంది. ఇందులో 2029 నాటికి 4,855 బస్సులు కొనుగోలు చేస్తారని స్పష్టం చేసింది. వీటికి ఆర్టిసి డిపోలు కేటాయించడంతోపాటు విద్యుత్ సదుపాయాలు కల్పించనున్నారు. దీనికోసం కిలోమీటర్ల చొప్పున అగ్రిమెంట్లు చేసుకున్నారు. తొలివిడతలో 1,450 బస్సులు వస్తున్నాయని, మిగిలినవి విడతల వారీ వస్తున్నాయని చెప్పి పలు డిపోలను పినాకిల్ సంస్థకు అప్పగించారు. ఈ మేరకు అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. ఈ బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలు చేయడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ఆల్ర్టా డీలక్స్ బస్సుల్లోనూ అమలు చేయడం లేదని, అటువంటప్పుడు వచ్చే బస్సుల్లో ఎలా అమలు చేస్తారని చర్చించినట్లు తెలిసింది. పైగా నిర్వహన ప్రైవేటు సంస్థ కావడంతో దానికి ప్రభుత్వ పథకాలతో సంబంధం ఉండదని, ఆర్టిసి సంస్థ పరిధిలో బస్సులకే దీన్ని పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. 2029 నాటికి దాదాపు 40 శాతం విద్యుత్ బస్సులు రానున్న నేపథ్యంలో వాటితోపాటే స్త్రీ శక్తి పథకం అమలు కూడా పరిమితమవుతుందని అధికారులు చెబుతున్నారు. పైగా అది కిలోమీటర్ల లెక్కన చెల్లింపులు ఉండనున్న నేపథ్యంలో ఉచిత పథకాలు అమలు చేయడం ద్వారా వాటికి వచ్చే నష్టాల్లోనూ ఆర్టిసి కొంత భరించాల్సి ఉంటుందని, అందువల్ల స్త్రీ శక్తి పథకం అమలు చేయడం సాధ్యం కాదని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై అధికారులను వివరణ కోరగా.. వారు స్పందించేందుకు ఇష్టపడలేదు. ప్రభుత్వ నిర్ణయాలు అమలు చేయడం తప్ప తమకు వ్యాఖ్యానించే అధికారం లేదని తెలిపారు.







కామెంట్లు (0)