కోడిగుడ్లు, టమోటాలతో బీభత్సం
మూత్రం పోసిన టిడిపి కార్యకర్త
ప్రజాశక్తి - ఎన్ఆర్ జిల్లా ప్రతినిధి : మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ విచారణ కోరుతూ వైసిపి ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలు విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని గవర్నమెంట్ ప్రెస్ సమీపంలో వైసిపి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరంపై టిడిపి శ్రేణులు దాడికి దిగాయి. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు వైసిపి శిబిరాన్ని ధ్వంసం చేశారు. దీంతో నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ముందుగా పోలీసుల అనుమతితో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నేతృత్వంలో వైసిపి కార్యకర్తలు విజయవాడ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద గురువారం ఉదయం నిరసన దీక్ష చేపట్టారు. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే బోండా ఉమా దౌర్జన్యానికి దిగారు. శిబిరంపై దాడి చేసి ధ్వంసం చేశారు. టెంట్ను తొలగించి నిరసన దీక్ష వద్ద ఉన్న కుర్చీలను ఎత్తి పోలీసులు, వైసిసి కార్యకర్తలపైకి విసిరేశారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. ఓ టిడిపి కార్యకర్త దీక్షా శిబిరంపైకెక్కి మూత్రం పోశాడు. దీంతో టిడిపి, వైసిపి కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దాదాపు రెండు గంటలపాటు వైసిసి దీక్షా శిబిరం వద్ద భయాందోళనలు, బీభత్సం సృష్టించారు. పరిస్థితి చేదాటిపోవడంతో పోలీసులు ప్రత్యేక భద్రతా బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మల్లాది విష్ణుతో పాటు పలువురు ముఖ్య నాయకులను పోలీసులు బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి ధర్నా చౌక్ కు తరలించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.








కామెంట్లు (0)