శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశంలోనే అతిపెద్ద ఎఐ డేటా సెంటర్‌

1 గంట క్రితం

data
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 01:16 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- రూ.70 వేల కోట్ల పెట్టుబడి.. 7 వేల మందికి ఉద్యోగాలు

- టిసిఎస్‌ ప్రతినిధులతో తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి సమావేశం

ప్రజాశక్తి హైదరాబాద్‌ బ్యూరో : దేశంలోనే అతిపెద్ద ఎఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేయనున్నట్లు టిసిఎస్​ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. అందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టిసిఎస్​ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డితో శనివారం సచివాలయంలో సమావేశమైంది. ఆ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రులు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్‌ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఎఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. హైపర్​ వాల్ట్‌తో పాటు భాగస్వామ్య సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణకు దాదాపు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఏడు వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు, హైపర్‌స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్‌కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అధిక సామర్థ్యమున్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఎఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఇది ఒకటిగా నిలవనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణకే కాకుండా దేశానికి ఇది చారిత్రాత్మక ప్రాజెక్టు అని అన్నారు. ఎఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచస్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోందని అభిప్రాయపడ్డారు. ఏఐ మోడల్స్‌, కంప్యూటింగ్ సామర్థ్యం భవిష్యత్తులో కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న తరుణంలో ఆ సామర్థ్యం తెలంగాణలోనే అందుబాటులో ఉండటం రాష్ట్రానికి గొప్ప ప్రయోజనమని అన్నారు. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన టిసిఎస్ ప్రతినిధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు.

తెలంగాణ రైజింగ్ విజన్-2047 ప్రకారం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు అని అభివర్ణించారు. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఎఐ, డేటా సెంటర్ల రంగంతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్‌వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్‌తో ఈ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనున్నారు. టిసిఎస్​ సిఇవొ కె కృతివాసన్, సిఒఒ ఆర్తి సుబ్రమణియన్, హైపర్​ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న, హైపర్​ వాల్ట్ సిఇఒ, ఎండి దీపేష్ నందా సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒపెన్​ ఎఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్