రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్
ప్రజాశక్తి-ఒంగోలు: వర్జినియా పొగాకు కొనుగోళ్ల కోసం తక్షణమే రూ.1000 కోట్లు కేటాయించాలని, సగటున క్వింటాకు రూ.25వేల మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శనివారం రైతులు భారీ ఎత్తున ప్రకాశం భవనాన్ని ముట్టడించారు. ఉదయం నుంచే ఎస్కెఎం పిలుపు మేరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి పొగాకు రైతులు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్కు తరలివచ్చారు. దీంతో ప్రకాశం భవనం ప్రాంగణమంతా రైతుల నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా ఎస్ కె ఎం నాయకులు మాట్లాడుతూ, రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పొగాకు రైతులను ఆదుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.









కామెంట్లు (0)