ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి
ప్రజాశక్తి-తుళ్లూరు(గుంటూరు) : రాజధాని అమరావతి నిర్మాణంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేయాలని ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారథి పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం రాయపూడిలోని ఏడీసీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. రాజధాని నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఉద్యోగులు అహర్నిశలు కృషి చేయాలని కోరారు. అమరావతిలో 320 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న రోడ్డు నెట్వర్క్తో పాటు రహదారులకు ఇరువైపులా చేపడుతున్న గ్రీనరీ ప్రాజెక్టులను ప్రతిష్ఠాత్మకంగా పూర్తి చేయాలని సూచించారు. శాఖమూరు సెంట్రల్ పార్కులో 300 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచస్థాయి ప్రాజెక్టులను అభివృద్ధి చేసి, రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కీర్తి చిరస్థాయిగా నిలిచేలా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. రైతులకు అభివృద్ధి చేసి అందించాల్సిన నివాస, వాణిజ్య ప్లాట్లకు సంబంధించి 13 ఎల్పీఎస్ జోన్ల అభివృద్ధి బాధ్యత ఏడీసీపై ఉందని తెలిపారు. అమరావతి అభివృద్ధిలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రతిభ కనబరుస్తున్న ఏడీసీ విభాగాధిపతులు టి.మోజెస్కుమార్, బి.నరసింహమూర్తి, సీహెచ్.ధనుంజయ, కె.వి.గణేష్బాబు, పి.సురేష్బాబు, ఎల్.ఎస్.వి.బి.నారాయణ, కె.శ్రీహరి, వి.విద్యాసాగర్, వి.ఎస్.ధర్మజ, బి.శ్రీనివాసులు తదితరులకు ఆమె ప్రశంసా పత్రాలను అందజేశారు.





కామెంట్లు (0)