- ఫొటోల కోసం ఆమె ప్రాధేయపడ్డారు
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- సరికాదన్న ఇటలీ ప్రధాని
వాషింగ్టన్/రోమ్ : సన్నిహిత మిత్రులైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోని మధ్య విభేదాలు ముదిరాయి. ఇటీవల జరిగిన జి-7 సదస్సులో తన ప్రజాదరణను పెంచుకోవడానికి మెలోని తనతో ఫొటోల కోసం పదేపదే ప్రయత్నించారని ట్రంప్ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీశాయి. శనివారం తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో చేసిన పోస్ట్లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్లో జరిగిన జి-7 సదస్సులో మెలోని ఫొటో కోసం తనను బతిమాలారని, జాలి కలిగి మాత్రమే తాను అందుకు అంగీకరించానంటూ రాసుకొచ్చారు.
వివాదానికి కారణం ఏమిటి?
ఇరాన్ విషయంలో అమెరికా చేపట్టిన సైనిక చర్యకు ఇటలీ మద్దతు ఇవ్వకపోవడమే ఈ విభేదాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దేశీయ రాజకీయ కారణాల దృష్ట్యా, వాషింగ్టన్తో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మెలోని ప్రయత్నిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ‘ఇప్పుడు ఇరాన్ను అమెరికా సైనికంగా ఓడించిన తర్వాత, ఆమె తన ‘నెంబర్స్’ (ప్రజాదరణ) పెంచుకోవడానికి మళ్ళీ స్నేహం చేయాలనుకుంటున్నారు. వద్దు బాబోయ్.. ధన్యవాదాలు’ అని ట్రంప్ తెలిపారు.
మెలోని ధీటైన సమాధానం
ట్రంప్ ఆరోపణలను మెలోని తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ‘అధ్యక్షుడు ట్రంప్, ఈ ప్రేరేపిత దాడులు అర్ధరహితం. నా ప్రజాదరణ ఇటలీ జాతీయ ప్రయోజనాలను కాపాడటంపై ఆధారపడి ఉంటుంది, నేను ఎప్పుడూ అదే చేస్తున్నాను’ అని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా, ట్రంప్ తన మిత్రదేశాల కంటే శత్రువుల పట్ల ఎక్కువ మర్యాద ప్రదర్శిస్తున్నారని ఆమె విమర్శించారు. ‘అమెరికా అధ్యక్షుడు తన మిత్రదేశాలతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో నాకు తెలియదు. పాశ్చాత్య దేశాల శత్రువుల పట్ల ఆయన చూపించే ఉదారత మిత్రుల పట్ల చూపకపోవడం విచారకరం’ అని ఆమె పేర్కొన్నారు. అలాగే ట్రంప్ వ్యాఖ్యలు ‘తీవ్రమైనవి, అవమానకరమైనవి’ అని పేర్కొంటూ, ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజాని తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం మెలోనిని మాత్రమే కాకుండా, మొత్తం ఇటలీని అవమానించడమేనని ఆయన పేర్కొన్నారు.









కామెంట్లు (0)