- కొనసాగుతున్న తేలికపాటి జల్లులు
ముంబై: మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు కేంద్ర వాతావరణ శాఖ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ఈ వారం మొత్తం ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొంకణ్ తీర ప్రాంతాలతో పాటు మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాల్లో గురువారం వరకు తేలికపాటి వర్షాలు కొనసాగనున్నాయి. రాయగడ్, రత్నగిరి జిల్లాల్లో బుధవారం వరకు తేలికపాటి వర్షాలు, ఆ తర్వాత మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. తీరప్రాంతమైన సింధుదుర్గ్ జిల్లాలో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పూణే, సతారా, కొల్హాపూర్ జిల్లాల కొండ ప్రాంతాల్లో కూడా ఈ వారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.
అదే సమయంలో విదర్భ ప్రాంతంలోని బుల్దానా, చంద్రాపూర్, గడ్చిరోలి, గోండియా, నాగ్పూర్ జిల్లాల్లో మంగళవారం లేదా బుధవారం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో స్థానికంగా విద్యుత్ అంతరాయాలు, పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు కోసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాలు, నీటి వనరుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని వాతావరణ శాఖ సూచించింది.







కామెంట్లు (0)