మదురై (తమిళనాడు) : తమిళనాడులోని మదురై సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగి ఐదుగురు మృతి చెందారు. మదురై జిల్లా కొట్టంపట్టి సమీపంలో జాతీయ రహదారిపై చెన్నై నుండి మార్తాండం వైపు వేగంగా వెళుతున్న ఒక ప్రైవేట్ ఆమ్ని (Omni) బస్సు అదుపుతప్పి, రోడ్డు డివైడర్ ను దాటి అవతల వైపు ఎదురుగా వస్తున్న ప్రభుత్వ రవాణా సంస్థ (SETC) బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొట్టిన వేగానికి ప్రైవేటు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి రోడ్డు పక్కన ఉన్న బస్ షెల్టర్లోకి దూసుకెళ్లగా, ప్రభుత్వ బస్సు రహదారిపైనే బోర్లా పడింది. తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న కొట్టంపట్టి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని బస్సు శిథిలాల మధ్య చిక్కుకుపోయిన బాధితులను బయటకు తీశారు. గాయపడిన 42 మంది ప్రయాణికులను అత్యవసర చికిత్స నిమిత్తం మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రి, మేలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రభుత్వ బస్సును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు - ఐదుగురు మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 13, 2026, 11:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)