- ఎలాంటి అభియోగాలు లేకుండానే ఆరేళ్లు నిర్బంధం
న్యూఢిల్లీ : 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్కు మరోసారి నిరాశే ఎదురయింది. వీరు దాఖలు చేసిన తాజా బెయిల్ పిటిషన్లను ఢిల్లీ కోర్టు శనివారం తిరస్కరించింది. అదనపు సెషన్స్ జడ్జి సమీర్ బాజ్పాయ్ ఈ ఇద్దరికీ ఉపశమనం కల్పించడానికి నిరాకరించారు. తమకు బెయిల్ నిరాకరిస్తూ మరో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ధర్మాసనం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖలీద్, ఇమామ్ బెయిల్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. ఉపా కింద నమోదైన కేసుల్లో కూడా ‘‘బెయిల్ మంజూరు చేయడం ఒక సాధారణ నియమం’’ అని మే నెలలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వీరు తమ పిటీషన్లో గుర్తు చేశారు. విచారణ ప్రారంభం కాకుండానే తమను నిర్బంధంలో ఉంచడం తమ ప్రాథమిక స్వేచ్ఛా హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంటూ ఖలీద్, ఇమామ్ బెయిల్ కోరారు. తమపై ఎలాంటి అభియోగాలు నమోదు కాకుండానే దాదాపు ఆరేళ్లుగా నిర్బంధంలో ఉన్నామని తెలిపారు. అయినా కూడా జడ్జీ వీరికి ఉపశమనం కల్పించడానికి నిరాకరించారు. 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లరకు కీలక సూత్రధారులుగా ఆరోపిస్తూ ఖలీద్, ఇమామ్లపై ఉపా కింద ఢిల్లీ పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు.








కామెంట్లు (0)