లఖిసరాయ్: బీహార్లోని లఖిసరాయ్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అశోక్ ధామ్ ఆలయం వద్ద సోమవారం ఉదయం భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం ఏడుగురు భక్తులు మృతి చెందగా, మరో 12 మందికి పైగా గాయపడ్డారు. శ్రావణ మాసంలోని మూడో సోమవారం కావడంతో శివుడికి పవిత్ర జలం సమర్పించేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. లఖిసరాయ్ రైల్వే స్టేషన్కు రెండు రైళ్లు చేరుకోవడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. భక్తుల రద్దీతో ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వెదురు బారికేడ్లు కూలిపోవడంతో, ఓ విద్యుత్ స్తంభం కూడా విరిగిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని లఖిసరాయ్ సదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొక్కిసలాటలో మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఘటనకు గల పూర్తి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.







కామెంట్లు (0)