గురువారం, 13 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition50 శాతం తగ్గిన గ్రామీణ ఉపాధి పనిదినాలు

1 గంట క్రితం

upadi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 14, 2026, 03:03 పూర్వాహ్నం | 5 నిమిషాల చదవడం

  • నెల రోజుల ‘వి.బి. గ్రామ్ జీ’ అమలు తీరు

​2015 మార్చిలో, తన మొదటి పదవీకాలం ప్రారంభమైన కొన్ని నెలలకే, లోక్‌సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్న మాటను గుర్తు చేసుకుందాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 60 ఏళ్ల కాంగ్రెస్ వైఫల్యానికి సజీవ స్మారక చిహ్నంగా అభివర్ణించి, దేశానికి నిరంతర జ్ఞాపికగా ఉండేలా దానిని పూర్తి వైభవంతో నడిపిస్తానని వాగ్దానం చేశారు. గత 11 సంవత్సరాల పాటు అదే పథకాన్ని కొనసాగించారు. నడుస్తూనే ఉంది. నిజానికి, దాని ప్రాధాన్యత అనూహ్యంగా పెరిగింది. భారతదేశ గ్రామీణ ఉపాధి భద్రతా పథకం వెనుక ఉన్న భారీ సంఖ్యలను పరిశీలిస్తే, ప్రజలను గుంతలు తవ్వేలా చేసిందని ప్రధానమంత్రి మోడీ చెప్పిన ఈ పథకం, ఆయన పాలనలో ‌రూ.86,000 కోట్ల భారీ వార్షిక జీవనాధారంగా రూపాంతరం చెందింది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ, ప్రతి సంవత్సరం దాదాపు 300 కోట్ల పనిదినాలను కల్పించింది.

ప్రస్తుత వి.బి.గ్రామ్ జీ పథకం అమలు విషయానికి వస్తే...... కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అధికారికంగా రద్దు చేసి, దాని స్థానంలో గ్రామీణ్ చట్టం లేదా వి.బి. గ్రామ్ జీ ని తెచ్చారు. ఈ కొత్త చట్టం కాగితం మీద భారీ హామీలు, కేటాయింపులు ప్రకటించింది. సంవత్సరానికి 100 రోజుల నుండి 125 రోజులకు పనిదినాలు పెంచుతామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. రూ.95,692 కోట్ల రికార్డు స్థాయి బడ్జెట్ అంచనాతో, దేశవ్యాప్తంగా అధిక దినసరి వేతనాలను ప్రకటించింది. తద్వారా, ఎక్కువ పనిదినాలు, అధిక వేతనం, వీటన్నిటికీ మద్దతుగా రికార్డు స్థాయిలో నిధులకు హామీ ఇచ్చారు.

ఈ పథకం అమలు జరిగిన 30 రోజుల తర్వాత, అధికారిక ప్రభుత్వ ఆడిట్ గణాంకాల ప్రకారం విబి గ్రామ్ జీ గ్రామీణ ఉద్యోగాల పనికల్పన 50 శాతం తగ్గిందని రుజువైంది. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’లో హరి కిషన్ శర్మ రాసిన ఒక వివరణాత్మక నివేదిక, ప్రభుత్వ అధికారిక పోర్టల్ నుండి లభించిన రియల్ - టైమ్ సమాచారంతో కలిసి, చాలా ఆసక్తికరమైన అంకెలను ఒకచోట చేర్చింది.

పనిదినాలు 50 శాతం తగ్గాయి. ఆగస్టు 9, 2026 నాటి అధికారిక డాష్‌బోర్డ్ డేటా ప్రకారం, జూలై 2026లో విబి గ్రామ్ జీ కింద 7.67 కోట్ల పనిదినాలు కల్పించబడ్డాయి. గత సంవత్సరం 2025 జూలైలో ఉపాధి హామీ పథకం కింద 15.33 కోట్ల పనిదినాలు సృష్టించబడగా, ఈ జూలైలో అవి 7.6 కోట్లుగా ఉన్నాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఇది కచ్చితంగా 49.94 శాతం తగ్గుదల. పనిపొందిన కుటుంబాల సంఖ్య కుప్పకూలింది. వాస్తవానికి పని పొందిన గ్రామీణ కుటుంబాల సంఖ్య 51.45% తగ్గింది. గత ఏడాది జూలైలో ఈ సంఖ్య 1.42 కోట్ల కుటుంబాలుగా ఉండగా, ఈ జూలైలో అది 68.94 లక్షల కుటుంబాలకు పడిపోయింది. ఇది గత ఐదేళ్లలో అత్యంత కనిష్ట స్థాయి.

గత నాలుగేళ్లుగా, అంటే 2022 నుండి 2025 వరకు, భారతదేశం ప్రతి జులైలో సగటున 21.56 కోట్ల వ్యక్తిగత పనిదినాలను రికార్డు చేసింది. 2026 జూలై నెలలో నమోదైన పనిదినాలు కేవలం 7.67 కోట్లు మాత్రమే. గత సంవత్సరంతో పోలిస్తే కేవలం 35 శాతం మాత్రమే. గత నాలుగేళ్లలో జులై నెలలో సగటున 1.72 కోట్ల కుటుంబాలకు పనిదొరికేది, కానీ ఈ సంవత్సరం 68.94 లక్షల కుటుంబాలు మాత్రమే ఈ గ్రామ్ జీ పథకం ద్వారా పనులు పొందారు. అంటే 40 శాతం కన్నా తక్కువ. గత ఐదేళ్లలో (కరోనా కాలం కంటే) అతి తక్కువ పనిదినాలు ఇవే కావడం గమనార్హం. ఈ అంకెలు కేంద్ర ప్రభుత్వ లైవ్ పోర్టల్ డేటాబేస్‌లో వున్నవే.

ఈ అధికారిక ప్రభుత్వ పోర్టల్ ప్రకారం ఈ జూలై 1వ తేదీ నుండి 10.83 కోట్ల మంది క్రియాశీల కార్మికులను పని కోసం నమోదు చేసుకున్నప్పటికీ, వాస్తవ పని కల్పించడం సరిగ్గా సగానికి పడిపోయింది. గత ఐదేళ్లపాటు ప్రతి జూలైలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సగటున 21 కోట్ల పనిదినాలు నమోదయ్యాయి. అది వాస్తవమైన పని. ఉదాహరణకు, 2024 - 2025 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ భారతదేశం అంతటా 89,55,000 ఆస్తులు నిర్మించబడ్డాయి. కందకాలు, చెరువులు, పంచాయతీ భవనాలు వంటివి నిర్మించబడుతున్నాయి. దీనిని సగటున తీసుకుంటే, గత సంవత్సరం ప్రతి నెలా సుమారు 7.5 లక్షల ఆస్తులు నిర్మించబడ్డాయి. విబి గ్రామ్ జీ డాష్‌బోర్డ్‌లోని డేటా ప్రకారం, ఈ జూలైలో కేవలం 1.2 లక్షల ఆస్తులు మాత్రమే నిర్మించబడ్డాయి, ఇది 84 శాతం తగ్గుదల.

ఈ సంవత్సరం, భారతదేశంలో రుతుపవనాల లోటు అతి తీవ్రంగా ఉంది. కేంద్ర వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 2026 జూన్ 1 నుండి ఆగస్టు 3 మధ్య, భారతదేశంలోని 741 జిల్లాల్లో ఏకంగా 50 శాతం జిల్లాలలో లోటు నుండి తీవ్రమైన లోటు వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికులు వ్యవసాయ పనులు కోల్పోతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ పథకం మాత్రమే వారిని ఆదుకునేది. వి.బి. గ్రామ్ జీ పథకంలోని సెక్షన్ 3, వ్యవసాయ విత్తనాలు నాటే, పంట కోతలు ఎక్కువగా జరిగే కాలంలో సంవత్సరానికి 60 రోజుల వరకు ఉపాధి హామీకి విరామం ఇవ్వాలని నిర్ణయించింది. వ్యవసాయ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం దీని ఉద్దేశం. వాస్తవానికి వర్షాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా, రాష్ట్ర అధికారులు 60 రోజుల విరామాన్ని అమలు చేయాల్సి వస్తుంది. కారణం నూతన డిజిటల్ వ్యవస్థ ఇందుకు అవకాశం ఇవ్వదు. కావున ఈ సంవత్సరం కరువు కారణంగా వ్యవసాయ పనులు మాయమయ్యాయి. కొత్త పథకం కింద ప్రభుత్వ కూలీ పనులు కూడా కనుమరుగయ్యాయి.

మరి తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం ఉన్న నెలలో పనిలో 50 శాతం తగ్గుదలకు కేంద్ర ప్రభుత్వం ఎలా వివరణ ఇస్తుంది? ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో హరికృష్ణ శర్మ రాసిన నివేదిక ప్రకారం, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, 2026 జూలై 1వ తేదీ నుండి దేశంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలో వీబీ గ్రామ్ జీ పథకం - 2025 విజయవంతంగా అమలు చేయబడిందని తెలిపారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయిలో 95,692 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాను కేటాయించారని, ఉపాధి కోరుతున్న 98 శాతానికి పైగా గ్రామీణ కుటుంబాలకు పని కల్పించారని ఆయన అన్నారు. అంటే, మన సంక్షేమ వ్యవస్థ 50 శాతం పనిదినాలు తగ్గిపోయి 98 శాతం డిమాండ్‌ను తీర్చామనదం హాస్యాస్పదం.

శారీరక శ్రమ చేసే వ్యవసాయ కూలీల వేతన బిల్లును కేంద్ర ప్రభుత్వం 100 శాతం (మన రాష్ట్రంలో 90 శాతం) చెల్లించింది. వి.బి. గ్రామ్ జీ పథకం ప్రకారం 60 శాతం మాత్రమే కేంద్రం ఇస్తూ, మిగిలిన 40 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టింది. మరో మార్పు ఏమిటంటే, ఉపాధి హామీ పథకం బాటమ్ `అప్’ అంటే డిమాండ్ ను బట్టి పని కల్పించేవారు. గ్రామ్‌ జీ దీనిని టాప్ - డౌన్ అంటే నిధులను బట్టి పని కేటాయింపుగా మార్చేశారు. పథకం అమలుకు సరిపడా నిధులను ప్రభుత్వాలు కేటాయించకపోతే కూలీలకు పనులు కల్పించే అవకాశమే లేదు.

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు గత పథకం కింద పొందిన దానికంటే తక్కువ నిధులను కేంద్రం ఇస్తుంది. ఒకవేళ స్థానికంగా కరువు ఏర్పడి, కేంద్రం ఇచ్చిన దానికంటే రాష్ట్ర ఖర్చు పెరిగితే, ఆ అదనపు ఆర్థిక భారాన్ని 100 శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. జూన్ 30న, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వి.బి. గ్రామ్ జీ కి కొత్త రోజువారీ వేతన రేట్లను నోటిఫై చేసింది. రోజుకు రూ.300 నుంచి రూ.409 మధ్య ఉన్నాయి. పెరిగిన ధరలతో పోలిస్తే (ద్రవోల్బణ లెక్కలను చూస్తే) వాస్తవ పెరుగుదల తెలంగాణలో రోజువారీ వేతనం కేవలం రూ.1, ఆంధ్రప్రదేశ్‌లో రూ.5 పెరిగింది. బహుశా కార్మికులను రోజువారీగా ఎక్కువగా ప్రభావితం చేసేది మరో పెద్ద మార్పు - అదే డిజిటల్ గేట్‌కీపింగ్. భారతదేశంలో, సాంకేతికత అనేక కొత్త సమస్యలను కూడా తెస్తుంది. వి.బి. గ్రామ్ జీ అమలుకు సాంకేతికతను ఒక కఠినమైన వడపోత సాధనంగా ఉపయోగిస్తున్నారు. పని ప్రదేశాలలో హాజరును రోజుకు రెండుసార్లు మొబైల్ యాప్ ద్వారా లైవ్ బయోమెట్రిక్ ఫేషియల్ రికగ్నిషన్ ఉపయోగించి నమోదు చేయాలి. పేలవమైన మొబైల్ కనెక్టివిటీ, సర్వర్ టైమఅవుట్‌లు ఉండే మారుమూల గ్రామీణ ప్రాంతాలలో, ఈ హై-టెక్ వ్యవస్థలు కూలీలను అనేక కష్టాలకు గురిచేస్తున్నాయి.

దీనికి స్థిరమైన ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. భారతదేశంలోని కొన్ని అత్యంత మారుమూల ప్రాంతాలలో, తప్పనిసరి ముఖ గుర్తింపును ప్రవేశపెట్టడం ఒక అత్యంత సంక్లిష్టమైన సమస్యను సృష్టిస్తుంది. ఒకవేళ సర్వర్ టైమ్ అవుట్ అయినా, లేదా డేటా కనెక్షన్ తెగిపోయినా, లేదా మండుటెండలో చెమటలు చిందిస్తూ పనిచేస్తున్న కార్మికుడిని ముఖ గుర్తింపు అల్గోరిథం గుర్తించడంలో విఫలమైనా, ఆ కార్మికుడు హాజరైనట్లుగా గుర్తించబడడు. కొత్త పథకం అమలులోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇన్ని సమస్యలు వుంటే రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని చూడాలో....

grafh



- ఫీచర్స్‌ అండ్‌ ‌పాలిటిక్స్‌


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్