గ్లాస్గో వేదికగా నేటినుంచి ప్రారంభం
షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీలకు నో ఛాన్స్
గ్లాస్గో(స్కాట్లాండ్): స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా 23వ కామన్వెల్త్ క్రీడలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేటినుంచి ఆగస్టు 2 వరకు జరిగే ఈ పోటీల్లో 74 దేశాలకు చెందిన 3వేల మందికి పైగా క్రీడాకారులు 215 పతకాలకోసం పోటీపడనున్నారు. భారత్కు తప్పక పతకాలు దక్కే షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, హాకీలకు చోటు దక్కలేదు. 125మంది అథ్లెట్లతో కూడిన భారత బృందానికి మహిళా అథ్లెట్లు లౌవ్లీనా బోర్గోహైన్, మీరాబాయ్ చాను ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించనున్నారు. అథ్లెటిక్స్లో అత్యధికంగా 32 మంది (10 మంది మహిళలు, 22 మంది పురుషులు) ప్రాతినిధ్యం వహించగా... ఆ తర్వాత బాక్సింగ్ (14 మంది), జూడో (14 మంది), వెయిట్లిఫ్టింగ్ (12 మంది) పోటీ పడుతున్నాన్నారు. మొత్తం 11 క్రీడాంశాలకు సంబంధించి 11 రోజుల పాటు ఈ పోటీలు సాగనున్నాయి.
తొలిరోజు ప్రారంభోత్స వేడుకలతోపాటు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రముఖ కళాకారులు కెటి టన్స్టాల్, టామ్ వాల్కర్ ప్రదర్శనలు ఇవ్వనున్నారు. తొలిసారిగా ఈ ప్రారంభోత్సవ వేడుకను ఓపెన్-ఎయిర్ కాకుండా పూర్తిగా ఇండోర్ వేదిక (OVO హైడ్రో)లో నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవ వేడుకల తర్వాత బౌల్స్ మరియు పారా బౌల్స్తో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి.
పతకాల్లో టాప్-10 లక్ష్యంగా భారత్...
కామన్వెల్త్ క్రీడల అథ్లెట్ల శిక్షణ కోసం భారత ప్రభుత్వం రూ. 53 కోట్లకు పైగా ఖర్చుచేసింది. అందులో బాక్సింగ్, అథ్లెటిక్స్కే సింహభాగం వెచ్చించింది. 11 క్రీడాంశాలకు గాను భారత్నుంచి 10 క్రీడాంశాల్లో మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోంది. భారత్కు అత్యధిక పతకాలు దక్కే షూటింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్తోపాటు హాకీ విభాగాలను గ్లాస్గో ఈవెంట్ నుంచి తప్పించారు. దీంతో పారా అథ్లెట్లతో కలిపి ఓవరాల్గా 125 మంది సభ్యులతో భారత్ కామన్వెల్త్ క్రీడల్లో పోటీపడుతోంది. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా నేతృత్వంలోని 32 మందితో కూడిన అథ్లెటిక్స్ బృందంపైనే భారత్ ఆశలన్నీ. కాగా, అమెరికా, స్విట్జర్లాండ్, టర్కీ, దక్షిణాఫ్రికా.. ఇలా విదేశాల్లో అథ్లెట్ల శిక్షణ కోసమే కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసింది. బాక్సింగ్లో ఏడుగురు పురుషులు, ఏడుగురు మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరి శిక్షణ కోసం రూ. 10 కోట్లు వినియోగించారు. ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను సహా 12 మంది వెయిట్ లిఫ్టర్ల శిక్షణ కోసం రూ. 7.5 కోట్లు వెచ్చించారు.
‘ముగింపు’లో రష్మిక, మహదేవన్
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల ముగింపు కార్యక్రమంలో నటి రష్మిక మందన్న, ప్రఖ్యాత గాయకుడు శంకర్ మహదేవన్ పాల్గోనున్నారు. 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యమివ్వ నుంది. ఈ నేపథ్యంలో ఈసారి గ్లాస్గో పోటీల చివరి రోజు తదుపరి గేమ్స్ పతాకాన్ని భారత్కు అందిస్తారు. ఈ సందర్భంగా 20 నిమి షాలపాటు సంగీతం, నృత్యంతో పాటు సంప్రదాయక ప్రదర్శనల ద్వారా మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి భారత్ చాటి చెప్పనుంది. ఇందులో భాగంగా జరిగే కార్యక్రమంలో రష్మిక, మహదేవన్ పాల్గొంటారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే.







కామెంట్లు (0)