వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అజయ్కి రజతం
ప్రజాశక్తి-విజయనగరంటౌన్, నెల్లిమర్ల :గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 79 కేజీల విభాగంలో రెండోస్థానంలో నిలిచి విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం కొండవెలగాడకు చెందిన వల్లూరి అజయ్ బాబు రజత పతకం సాధించారు. సరిగ్గా 16ఏళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ పోడియంపై ఆయన తండ్రి వల్లూరి శ్రీనివాసరావు జాతీయ జెండాను రెపరెపలాడించగా, ఇప్పుడు గ్లాస్గో వేదికగా తనయుడు రజత పతకాన్ని సాధించి రికార్డు సృష్టించారు. 21ఏళ్ల అజయ్ మొత్తంగా 330 కిలోల (స్నాచ్ సెక్షన్లో 149 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ సెక్షన్ లో 181 కిలోలు) బరువు ఎత్తాడు.
తండ్రి వారసత్వం.. కుమారుడి ఘనత
అజయ్ తండ్రి వల్లూరి శ్రీనివాసరావు కూడా వెయిట్ లిఫ్టింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో 56 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించడంతో ఆయన గ్రామం పేరు అప్పట్లో అంతర్జాతీయ వేదికపై మార్మోగింది. నేడు ఆయన కుమారుడు సత్తాచాటి గ్రామాన్ని చరిత్ర పటంలో పదిలం చేశారు.
మంత్రి కొండపల్లి అభినందనలు
కామన్వెల్త్ గేమ్స్లో వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకం సాధించిన విజయనగరం జిల్లాకు చెందిన వల్లూరి అజయ్బాబు భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి, జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అజయ్బాబు తండ్రి , 2010 ఢిల్లీ ఒలింపిక్స్లో పతకం సాధించిన వల్లూరి శ్రీనివాసబాబును తన క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మతో కలిసి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నాడు తండ్రి .. నేడు తనయుడు ఇద్దరూ విశ్వక్రీడా వేదికపై విజయనగరం పేరు చిరస్థాయిగా నిలిచేలా చేశారని కొనియాడారు.







కామెంట్లు (0)