న్యూఢిల్లీ : ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా జాయింట్ సెక్రెటరీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ మాజీ అధ్యక్షురాలు ఐషే ఘోష్ను అరెస్టు చేసేందుకు ఢిల్లీ పోలీసులు విఫలయత్నం చేశారు. మంగళవారం సిపిఎం జాతీయ కార్యాలయం ఏకే గోపాలన్ భవన్లోకి ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రవేశించారు. అదే సమయంలో అక్కడే ఉన్నా ఎంపీ జాన్ బ్రిట్టాస్ పోలీసులను చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. యూనిఫామ్లు లేకుండా, ప్రయివేటు వాహనంలో తరలివచ్చారని, జెన్ జీ నిరసనలకు మద్దతుగా నిలిచిన వామపక్ష విద్యార్థుల పట్ల మోడీ ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తుందని ఎంపీ మండిపడ్డారు.
ఒక రాజకీయ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా చొరబడటం, విద్యార్థి ఉద్యమ నాయకులపై కొనసాగుతున్న వేధింపులు మోడీ ప్రభుత్వ ప్రజాస్వామ్య హక్కులపై పెరుగుతున్న దాడులకు నిదర్శనం, విద్యార్థులు లేవనెత్తుతున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, పోలీసు అధికారాన్ని ఉపయోగించి వారిని బెదిరించడం, గొంతు నొక్కడం,నిరసనలను నేరంగా ముద్రించే ప్రయత్నం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ఈ చట్ట విరుద్ధ చర్యలను సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయం, విద్యాహక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులకు సిపిఎం తన సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తోందని ఎంపీ స్పష్టం చేశారు.








కామెంట్లు (0)