అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను మా పాఠశాలలో ఎంతో ఆనందంగా జరుపుకున్నాం. రంగురంగుల రాఖీలు, చిరునవ్వులతో మా పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. మేమంతా మా ఇళ్ల నుంచి అందమైన రాఖీలను తీసుకుని పాఠశాలకు వచ్చాం. ముందుగా రాఖీ పండుగ విశిష్టతను మా ఉపాధ్యాయినులు మాకు వివరించారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఒకరినొకరు ప్రేమగా చూసుకోవాలని, కష్టాల్లో ఒకరికొకరు అండగా నిలవాలని చెప్పారు. అనంతరం మేమంతా ఒకరికొకరం రాఖీలు కట్టుకున్నాం. రాఖీ కట్టిన తరువాత మిఠాయిలు పంచుకుని ఆనందంగా గడిపాం. తోటి విద్యార్థులను సోదరులు, సోదరీమణులుగా భావిస్తూ ప్రేమగా పలకరించుకున్నాం. ఒకరి పట్ల ఒకరు గౌరవంగా ఉండాలని, ఎవరైనా బాధలో ఉంటే వారికి సహాయం చేయాలని ప్రతిజ్ఞ చేశాం. మా ఉపాధ్యాయినులు కూడా మాతో కలిసి రాఖీలు కట్టుకున్నారు. రాఖీ అంటే కేవలం ఒక దారం కాదని, మనుషుల మధ్య ప్రేమను, నమ్మకాన్ని, బాధ్యతను గుర్తుచేసే అనుబంధమని చెప్పారు. కుటుంబంలోనే కాకుండా పాఠశాలలోనూ అందరినీ మనవారిగా భావించి ఆప్యాయంగా మెలగాలని సూచించారు. ‘రాఖీ పండుగ మన మధ్య ఉన్న అనుబంధాలను మరింత బలపరుస్తుంది. ప్రేమ, ఆప్యాయత, పరస్పర గౌరవం, సహకారం వంటి మంచి విలువలను చిన్నతనం నుంచే పిల్లల్లో పెంపొందించాలి. ఒకరికి ఒకరు అండగా నిలిచే మంచి మనసు ఉన్నప్పుడే సమాజంలో అనుబంధాలు బలపడతాయి’ అని మా స్కూలు కరస్పాండెంట్ వల్లభనేని మురళీకృష్ణ గారూ, ప్రిన్సిపాల్ వల్లభనేని నాగలక్ష్మి గారూ సందేశం ఇచ్చారు. ఈ రాఖీ వేడుకలతో మా పాఠశాలలో ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరిశాయి. రాఖీలు కట్టుకోవడం ద్వారా మేము కొత్త స్నేహాలను ఏర్పరచుకున్నాం. ఒకరినొకరు గౌరవించుకోవడం, సంతోషాన్ని పంచుకోవడం, అవసరమైనప్పుడు తోడుగా నిలవడం నేర్చుకున్నాం.
రాఖీ దారం చిన్నదే అయినా...అది కలిపే అనుబంధాలు ఎంతో గొప్పవి.
-జాహ్నవి, 2వ తరగతి,
వెన్నల సహస్ర, 1వ తరగతి,
బచపన్ ప్లే స్కూలు, తాడేపల్లి,
తాడేపల్లి మండలం, గుంటూరుజిల్లా.








కామెంట్లు (0)