మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

1 గంట క్రితం

HYDRA Commissioner Ranganath approaches the High Court.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 12:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్ కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన అప్పీల్‌కు వెళ్లారు. వివాదాస్పద ఆస్తి విషయంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైడ్రా కమిషనర్ ఉల్లంఘించారని, యంత్రాలు, సిబ్బందితో సదరు భూమిలోకి వెళ్లడం చట్టవిరుద్ధమని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరిపాలనలో చట్టపాలన మాత్రమే కొనసాగాలని, వ్యక్తుల ఆధిపత్యం నడవకూడదని పేర్కొంది. ఒకే భూవివాదంలో మూడుసార్లు కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడం, హైడ్రాపై 60కి పైగా పిటిషన్లు ఉండటాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. సుప్రీం కోర్టు గతంలో వెలువరించిన ‘టాటా మోహన్ రావు’ కేసు తీర్పును ఉటంకిస్తూ.. శిక్షించడం కంటే క్షమించడంలోనే ఔన్నత్యం ఉందన్న భావనను ప్రస్తావించిన న్యాయమూర్తి, ఈ కేసులో రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ విచారణను ముగిస్తూనే ఆయనను కమిషనర్ బాధ్యతల నుంచి బదిలీ చేసి మరొక అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)కి సూచించారు. సింగిల్ జడ్జి వెలువరించిన ఈ తీర్పును సవాలు చేస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. రంగనాథ్‌ను బదిలీ చేయాలన్న సూచనతో పాటు కోర్టు చేసిన వ్యాఖ్యలపై ఈ అప్పీల్‌లో న్యాయపరమైన అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తీర్పు వెలువడిన నెలరోజుల తర్వాత ఆయన హైకోర్టుకు అప్పీలుకు వెళ్లగా.. దానిపై కోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్