నేటి నుంచి ఎపి రైతు సంఘం రాష్ట్ర మహాసభ
తొలిరోజు ప్రదర్శన, బహిరంగ సభ
ముఖ్య అతిథులుగా ఎఐకెఎస్ నేతలు విజూకృష్ణన్, థావలే
ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభకు ఏలూరు ముస్తాబైంది. 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న మహాసభకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని డిసిఎంఎస్ (జిల్లా కో-అపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ) ఫంక్షన్ హాలులో మూడు రోజుల సమావేశాలకు అన్ని ఏర్పాట్లూ జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 500 మంది రైతు సంఘం ప్రతినిధులు ఈ సభలకు హాజరు కానున్నారు. తొలిరోజు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు జ్యూట్ మిల్లు సెంటర్ నుంచి కలెక్టరేట్ వద్ద గ్రౌండ్ వరకూ భారీ రైతు, ప్రజా ప్రదర్శన సాగనుంది. అనంతరం గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరగనుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ ఆహ్వాన సంఘం పూర్తి చేసింది. గడిచిన కొన్ని రోజులుగా ‘హలో రైతన్న... చలో ఏలూరు’ నినాదంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా సదస్సులు, సెమినార్లు నిర్వహించారు. అన్ని మండలాల్లో ప్రచార జాతాలు సాగాయి. కరప్రతాలు, పోస్టర్లు, బ్యానర్లతో విస్తృత ప్రచారం చేశారు. విద్యార్థులకు వ్యవసాయంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. మహాసభ నేపథ్యంలో ఏలూరు నగరం మొత్తం రైతు సంఘం జెండాలతో ఎరుపెక్కింది. ఫైర్ స్టేషన్ సెంటర్, జ్యూట్ మిల్లు సెంటర్, ఇండోర్ స్టేడియం, డిసిఎంఎస్ వద్ద ఎర్ర జెండాలతో ఆకర్షణీయంగా అలకరించారు. రాష్ట్ర మహాసభకు ముఖ్యఅతిథులుగా అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) జాతీయ ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్, జాతీయ అధ్యక్షులు అశోక్ థావలే హాజరు కానున్నారు. మాజీ మంత్రి, ఎస్ కెఎం రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఎఐకెఎస్ జాతీయ సహాయ కార్యదర్శి టి.సాగర్, ఎపి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.బలరాం, ఇతర నాయకులు పాల్గోనున్నారు. రైతాంగ సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం రంగంలో అనుసరిస్తోన్న విధానాలపై శని, ఆదివారాల్లో చర్చించనున్నారు. పలు పంటల సమస్యలపై తీర్మానాలు చేయనున్నారు. చివరి రోజు మహాసభ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనుంది.
వ్యవసాయ రంగంలో ఏలూరు, పశ్చిమగోదావరి కీలక భూమిక
ఏలూరు, పశ్చిమగోదావరి పూర్తిగా వ్యవసాయాధిరిత జిల్లాలు. వరి, పామాయిల్, మొక్కజొన్న, పొగాకు, మామిడి, ఆక్వా, పత్తి, మిరప, కోకో, కూరగాయాలు వంటి అనేక పంటలు సాగవుతున్నాయి. అనేక పంటల సాగుకు ఇక్కడ భూములు అనుకూలంగా ఉన్నాయి. రైతుల సమస్యలపై నిరంతరం అనేక పోరాటాలు, ఆందోళనలకు ఈ జిల్లాలు వేదికలుగా ఉంటున్నాయి. కోకో, పామాయిల్, ఆక్వా, ధాన్యం కొనుగోలు వంటి అనేక పంటల సమస్యలపై నిరంతరం ఎపి రైతు సంఘం తమ గళం వినిపిస్తూనే ఉంది. 1897 బ్రిటిష్ వారికాలంలోనే ఏలూరు రైతు ఉద్యమాలకు కేంద్రంగా నిలిచింది. ఆతర్వాత 1936లో ఆఖిల భారత కిసాన్ సభ ఏర్పడగా 1954లో ఎఐకెఎస్కు అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్రంలోని రైతు ఉద్యమాలకు వేదికగా మారింది. ఉమ్మడి పశ్చిమగోదావరిలో 1995, 2009లో రెండుసార్లు రైతు సంఘం రాష్ట్ర మహాసభ భీమవరంలో జరిగింది. ఇప్పడు మరోసారి రాష్ట్ర మహాసభకు సిద్ధమైంది. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న కుట్రలను రైతు సంఘం తీవ్రంగా ప్రతిఘటిస్తూ రైతుల పక్షాన నిలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ పంటలు పండిస్తున్న రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అజెండాగా రైతు సంఘం రాష్ట్ర మహాసభ జరగనుంది.







కామెంట్లు (0)