న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) సాంకేతికత కేవలం చిప్ల తయారీ వ్యయాన్ని పెంచడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రధాన ఆర్థికవేత్త పియర్ ఆలివర్ గౌరించాస్ హెచ్చరించారు. ఎఐ రంగంలో భారీ పెట్టుబడులు వినియోగదారులపై భారాన్ని పెంచుతున్నాయని, ఇవి పరోక్షంగా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల స్టాక్ మార్కెట్లలో ఎఐ కంపెనీల వాల్యుయేషన్లు ఊహించని రీతిలో పెరిగాయి. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలు, రిటైర్మెంట్ ఖాతాలు లాభాల బాటలో పయనిస్తున్నాయి. సంపద పెరగడంతో ఇళ్లు, విహారయాత్రలు వంటి ఖరీదైన వ్యయాల వైపు మొగ్గు చూపుతున్న వారు కూడా ఉన్నారన్నారు. ఈ అదనపు డిమాండ్ మార్కెట్లో ధరల పెరుగుదలకు ఆజ్యం పోస్తుందని గౌరించాస్ వివరించారు. ఎఐ వల్ల ఉత్పన్నమవుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం రెండు మార్గాల్లో ఉంటుందన్నారు. మొదటిది.. చిప్ల కొరత వంటి సరఫరా గొలుసు అడ్డంకుల వల్ల వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఆపిల్ సంస్థ మెమరీ, స్టోరేజ్ ఖర్చుల కారణంగా తన డివైజ్ల ధరలను పెంచగా.. మైక్రోసాఫ్ట్ సంస్థ ఎక్స్బాక్స్ కన్సోల్ ధరలను సవరించింది. మరోవైపు ఇన్వెస్టర్ల చేతిలో డబ్బు పెరిగి డిమాండ్ పెరిగింది. ఈ 2 అంశాలు ఒకే దిశలో పయనిస్తూ ద్రవ్యోల్బణాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు.
ద్రవ్యోల్బణానికి ఎఐ ఆజ్యం : ఐఎంఎఫ్
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 27, 2026, 11:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్లు (0)