క్లోజర్ రిపోర్టుపై తీవ్ర అభ్యంతరాలు
ప్రజాశక్తి-అమరావతి : రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్) అలైన్మెంట్, సీడ్ క్యాపిటల్ ల్యాండ్ పూలింగ్ వ్యవహారాల్లో అవినీతి, నేరపూరిత కుట్ర ఆరోపణలపై సిఐడి నమోదు చేసిన కేసును కొట్టేస్తూ విజయవాడ ఎసిబి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. సిఎం చంద్రబాబు, నారా లోకేష్, పొంగూరు నారాయణ, లింగమనేని రమేష్, రమాదేవి, హెరిటేజ్ ఫుడ్స్ తదితరులపై నమోదైన కేసులో సిఐడి దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును ఎసిబి కోర్టు ఆమోదించడం చట్టవిరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
సిఐడి సమర్పించిన క్లోజర్ రిపోర్టు నిందితులకు అనుకూలంగా రూపొందించిన పక్షపాత నివేదిక అని, తాను దాఖలు చేసిన ప్రొటెస్ట్ పిటిషన్లోని అభ్యంతరాలను ఎసిబి కోర్టు స్వతంత్రంగా పరిశీలించకుండా యాంత్రికంగా ఆమోదించిందని పిటిషన్లో వివరించారు. గతంలో దాఖలైన చార్జిషీట్లోని కీలక సాక్ష్యాలు, ఆర్థిక లావాదేవీలు, డాక్యుమెంటరీ ఆధారాలను దర్యాప్తు అధికారి విస్మరించి పూర్తిగా భిన్నమైన నివేదిక సమర్పించారని ఆరోపించారు. సిట్ దర్యాప్తును రాజకీయ కారణాలతో నిర్వీర్యం చేశారని, సుప్రీంకోర్టు స్టే రద్దు చేసిన ఉత్తర్వులను కూడా క్లోజర్ రిపోర్టులో ఉద్దేశపూర్వకంగా ప్రస్తావించలేదని అన్నారు. నారాయణకు చెందిన విద్యాసంస్థల నుంచి రూ.16.5 కోట్ల నిధుల మళ్లింపుపై గతంలో సేకరించిన ఆధారాలను సైతం పక్కన పెట్టారని, ఎపి సిఆర్డిఎ చట్టంలోని రక్షణ నిబంధనలను ఎసిబి కోర్టు తప్పుగా వర్తింపజేసిందని పేర్కొంటూ తీర్పును రద్దు చేయాలని కోరారు.









కామెంట్లు (0)