జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రికి లేఖ రాసిన సిపిఎం ఎంపి జాన్ బ్రిట్టాస్
ఎన్నికల సంఘం సరైన నిర్ణయం తీసుకోవాలి: ఎడిటర్స్ గిల్డ్
ప్రతి ఒక్కరూ దీనిని నిరసించాలి: *పినరయి విజయన్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మాజీ టెలిగ్రాఫ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ అయిన ఆర్. రాజగోపాల్ను ఓటర్ల జాబితా నుంచి తొలగించి, పాస్పోర్ట్ను నిరాకరించిన ఘటన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యను రాజకీయ పార్టీలు, నాయకులు, సామాజిక కార్యకర్తలు, మీడియా సంస్థలు తీవ్రంగా విమర్శించాయి. ఎస్ఐఆర్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి రాజగోపాల్ పేరును తొలగించిన తరువాత, ఆయన పాస్పోర్ట్ను పునరుద్ధరించలేదు. దీంతో, ఆయన అమెరికాలో జరుగుతున్న తన కుమార్తె వివాహానికి హాజరు కాలేకపోయారు. తనకు ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ రాజగోపాల్ రాసిన ఒక లేఖ సోషల్ మీడియా, ఇతర వేదికలపై వైరల్ అయింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాసిన జర్నలిస్ట్పై ఇది ప్రతీకార చర్య అని కూడా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ సిపిఎం రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కు లేఖ రాశారు. ఒక వ్యక్తిని ఓటర్ల జాబితా నుండి తొలగించారనే కారణంతో అతని పాస్పోర్ట్ పునరుద్ధరణ దరఖాస్తును తిరస్కరించడం చట్టబద్ధమేనా అని జాన్ బ్రిట్టాస్ ప్రశ్నించారు. ‘‘1967 పాస్పోర్ట్ చట్టం ప్రకారం, ఓటర్ల జాబితా నుండి తొలగించడం అనేది పాస్పోర్ట్ పునరుద్ధరణ దరఖాస్తును తిరస్కరించడానికి ఒక కారణంగా పరిగణించరాదు. సత్వత్ సింగ్ సాహ్నీ, మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రకారం, పాస్పోర్ట్ చట్ట పరిధికి వెలుపల ఉన్న కారణాలతో ఎవరికీ పాస్పోర్ట్ను నిరాకరించడం గానీ, నిలిపివేయడం గానీ కుదరదు. ఈ పరిస్థితిలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలి’’ అని జాన్ బ్రిట్టాస్ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం న్యాయం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. ఈ పరిస్థితి రేపు ఎవరికైనా ఎదురుకావచ్చని సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ పేర్కొన్నారు. రాజగోపాల్కు పాస్పోర్ట్ నిరాకరించడాన్ని సిపిఎం, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. ఓటర్ల జాబితా నుండి తనను తొలగించడం వల్ల చాలా మానసిక ఒత్తిడికి గురయ్యానని రాజగోపాల్ మీడియాతో అన్నారు. పాస్పోర్ట్ పునరుద్ధరణకు దరఖాస్తు చేసినప్పుడు, ఎస్ఐఆర్ నుండి నా పేరును తొలగించినందున నాకు క్లియరెన్స్ ఇవ్వలేమని పోలీసులు తెలియజేశారని రాజగోపాల్ తెలిపారు.
బిజెపి ఎజెండాకు సాధనం ‘ఎస్ఐఆర్’ : పినరయి విజయన్
పాస్పోర్టు నిరాకరణ చర్యను సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు. ‘‘జాతీయ దినపత్రిక 'టెలిగ్రాఫ్' మాజీ సంపాదకుడు, మలయాళీ అయిన ఆర్. రాజగోపాల్ పాస్పోర్ట్ను పునరుద్ధరించడానికి అధికారులు నిరాకరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికా సంపాదకుడి అనుభవమే ఇలా ఉంటే, ఈ దేశంలోని సామాన్య పౌరుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. బిజెపిని తీవ్రంగా విమర్శించే వ్యక్తిగా, రాజగోపాల్ ప్రతీకార చర్యలకు గురై ఉంటారు. అయితే దీనితో పాటు, ప్రాంతీయ దృక్పథంతో, ఎస్ఐఆర్తో సామాన్య పౌరులను వేటాడి, బహిష్కరిస్తున్నారు. విభజనవాద హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లే సాధనంగా ఎస్ఐఆర్ మారింది. ఎస్ఐఆర్ ఆధారంగా పౌరసత్వం నిర్ణయిం చబడకుండా చూడటం అవసరం. పౌరుల జీవితాలు, హక్కులు కాలరాస్తున్న ప్పుడు దేశాన్ని ప్రేమించేవారు మౌనంగా ఉండలేరు. ప్రజాస్వామ్యాన్ని విలువగా భావించే ప్రతి ఒక్కరూ దీనిని నిరసించాలి’’ అని అన్నారు.









కామెంట్లు (0)