విజయవాడ : సర్ ప్రక్రియ గడువుని పొడిగించాలి .. గ్రామ, వార్డు సభలలో ఓటర్ల లిస్టును ప్రకటించి అవగాహన కల్పించాలి అని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం (ఈనెల 28, 29 తేదీలలో) పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం అధ్యక్షతన విజయవాడలో జరిగింది. ఈ సమావేశానికి పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, యు.వాసుకి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి హాజరయ్యారు. ఈ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానాన్ని మంగళవారం ఓ ప్రకటనలో విడుదల చేశారు.
ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ (స్పెషల్ ఎంటెన్సివ్ రివిజన్) ప్రక్రియలో ప్రజలు ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని గడువును కనీసం మరో నెల అప్లికేషన్లు అందించడానికి సమయాన్ని పొడిగించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ నేతలు కోరారు. ఓటర్లకు తగిన అవగాహన లేకపోవడం, అవసరమైన పత్రాలను సమర్పించడానికి తగిన సమయం లేకపోవడం, దూర ప్రాంతాలు, వృద్ధులు, దివ్యాంగులు, పేదలు, వలస కార్మికులు వంటి తరగతులు ఈప్రక్రియలో భాగస్వాములు కావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనివల్ల అర్హులైన ఓటర్లు ఓటరు జాబితా నుండి తొలగిపోయే ప్రమాదం ఉందని అన్నారు. బిఎలఓలు వారికి కేటాయించిన కుటుంబాలను కలిసి అప్లికేషన్ ఫారం అందించడం కూడా ఇంతవరకు పూర్తి కాలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు రాజ్యాంగబద్ధమైన అత్యంత విలువైన హక్కు అని చెప్పారు. ఈ హక్కును ప్రతి పౌరుడు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. దానికోసం ప్రతి గ్రామం/ వార్డు/ బూత్ స్థాయిలో సభలు పెట్టి అవగాహన కల్పించాలన్నారు. మ్యాపింగ్ చేసిన లిస్టులను బహిరంగంగా ప్రకటించాలని సిపిఐ(యం) కోరుతున్నదన్నారు. అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం ఆచరణలో వస్తున్న సమస్యలను గుర్తించి ప్రజలందరికీ అవకాశం కల్పించేలా గడువును పొడిగించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, వార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి ఓటు వివరాలను ప్రకటించాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. బూత్ స్థాయిలో ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, వలస కార్మికులు తదితరులకు ప్రత్యేక సహాయం అందించాలన్నారు. అత్తగారి కుటుంబానికి వచ్చే వివాహిత మహిళల సమస్యలను పరిష్కరించడానికి సరైన సూచనలు ఇవ్వాలని, సరైన విచారణ, నోటీసు ఇవ్వకుండా ఏ ఓటరినీ జాబితా నుండి తొలగించకూడదు అని సూచించారు. ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా, పారదర్శకంగా, వివక్ష లేకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను నిర్వహించాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పై డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ కోరుతోందని పేర్కొన్నారు.









కామెంట్లు (0)