ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ సంస్థల్లో విడుదల చేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (ఎఇఇ) 629 పోస్టులకు 1,05,566 మంది దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్కో పరిధిలో 200, ఎపిఇపిడిసిఎల్ పరిధిలో 135, ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలో 134, ఎపిసిపిడిసిఎల్ పరిధిలో 60, జెన్కో పరిధిలో 100 చొప్పున భర్తీ జరగనున్నాయి. ఈ నెల 23 నుంచి 27 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి) విధానంలో రెండు పూటలా జరగనున్న ఈ పరీక్షకు విస్తృత ఏర్పాట్లు చేశామని ఎపి ట్రాన్స్కో జెఎమ్డి సూర్యసాయి ప్రవీణ్చంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్ష జరగనుందని పేర్కొన్నారు. మొత్తం 94 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 81, రాష్ట్రం వెలుపల 13 కేంద్రాల చొప్పున ఉన్నాయని వివరించారు. పరీక్షలు ముగిసిన మూడు రోజుల్లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల చేస్తామన్నారు. పైనల్ ఆన్సర్ కీ, నార్మలైజ్డ్ స్కోర్లు, మెరిట్ జాబితాను సెప్టెంబరు చివరిలో విడుదల చేస్తామన్నారు. 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. బయోమెట్రిక్ ధృవీకరణ, సిసి కెమెరాల పర్యవేక్షణ, కేంద్రస్థాయి మానిటరింగ్తో పాటు పటిష్టమైన పరిపాలనా, భద్రతా చర్యలు చేపట్టామన్నారు.
ఈ నెల 14 నుంచి అభ్యర్ధుల హాల్ టికెట్లను రిక్రూట్మెంట్ పోర్టల్ apvidyutrecruitment. apc fs s. inలో విడుదల చేశామని పేర్కొన్నారు.








కామెంట్లు (0)