- రూ.3200 కోట్లతో ప్రతిపాదనలు
- అమరావతి ట్రంక్ రోడ్ల పొడిగింపు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని నగరంలో నిర్మిస్తున్న ట్రంకు రోడ్లను ఇంటర్నల్ రింగు రోడ్డు(ఐఆర్ఆర్)కు అనుసంధానం చేసే ప్రాజెక్టుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం రూ.3200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆమోదం తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి. ఇంటర్నర్ రింగు రోడ్డుకు అవసరమైన భూమి కోసం ఇప్పటికే సిఆర్డిఏ ఆయా గ్రామాల్లో సభలు నిర్వహించింది. కంతేరు, తాడికొండ, మోతడక గ్రామాల్లో భూములు సమీకరణ పద్ధతిలో తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా మోతడకలో గతంలో గ్రామసభ ఆమోదం మేరకు పూలింగుకు తీసుకోవాలని అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. ఇంటర్నర్ రింగురోడ్డును కంతేరు సమీపంలో నుండి వైకుంఠపురం వరకూ నిర్మిస్తున్నారు. రెండోదశ అభివృద్ధిలో భాగంగా తొలిదశలో ఉన్న ట్రంక్ లైన్లను ఐఆర్ఆర్కు కలపాలని గతంలోనే ప్రతిపాదనలు వచ్చాయి. వాటిల్లో ముఖ్యంగా తూర్పు పడమరలకు వేస్తున్న ఈ సిరీస్ రోడ్డు 2,7,8,13, ఉత్తర దక్షిణం వరకూ వేస్తున్న ఎన్ సిరీస్ రోడ్లలో 10, 12, 15, 17 రోడ్లను మరింత విస్తరించడంతోపాటు ఇంటర్నల్ రింగురోడ్డుకు అనుసంధానం చేయనున్నారు. దీనిపై సర్వే ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఇప్పటికే సీడ్ యాక్సిస్ రోడ్డును పాత జాతీయ రహదారికి కలిపిన నేపథ్యంలో మిగిలిన రోడ్లను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఐఆర్ఆర్ నిర్మాణంతోపాటు దానికి సమాంతరంగా రాఝధాని రోడ్లనూ కలపనున్నారు. దీని ద్వారా రవాణా మెరగవుతుందని అంచనా వేస్తున్నారు. 2028 నాటికి రాజధాని పూర్తి చేసే సమయానికి రోడ్లను కూడా పొడిగించనున్నారు. ఇప్పటికే ఈ 13 రహదారిని వడ్డేశ్వరం వద్ద ఎన్హెచ్ 16లో కలిపే పని ప్రారంభించారు. దీనికోసం ఎయిమ్స్ వెనుక కొండ ప్రాంతాలన్ని తొలిచారు. అలాగే ఈ 15 రోడ్డును కూడా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారికి కలపాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన పనులూ ప్రారంభం అవుతున్నాయి. అలాగే ప్రస్తుతం ఉన్న ఎన్6ను జాతీయ రహదారికి ఇచ్చేశారు. ఈ రోడ్డు నిర్మాణ సమయంలోనూ మాస్టర్ ప్లాను ప్రకారం ఉన్న రోడ్లు దాదాపు దెబ్బతిన్నాయి. నేరుగా కనెక్టివిటీ లేకుండా పోయింది. దీంతో జాతీయ రహదారికి అండర్పాస్లు లేదా ఫ్లైఓవర్లు నిర్మించాల్సి ఉంది. దీనిపై గతంలోనే కేంద్రానికి లేఖ రాశారు. మరో ఏడాదికాలంలో అమరావతి రాజధాని నగరంలో రోడ్లను పూర్తి చేయడంతోపాటు ఇంటర్నల్ రింగు రోడ్డుకు అనుసంధానం చేసే ప్రక్రియను కొలిక్కి తీసుకురానున్నారు.








కామెంట్లు (0)